హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 6వ తేదీన రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ ప్రకటించారు. పీవీ నర్సింహారావు వెటర్నరీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను జారీచేయగా, ఇందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)ను నిర్వహించనున్నామన్నారు.
ఈ ఉద్యోగాల కోసం మొత్తం 5,888 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరికి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోని హెచ్ఎండీఏ పరిధిలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ -1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 (సెక్రెట్రియల్ ఎమిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్)కు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులను ఉదయం 9:15 గంటల లోపు, మధ్యాహ్నం 1:15 గంటలలోపు మాత్రమే పరీక్షాకేంద్రాల్లోని అనుమతిస్తామని, ఫొటో గుర్తింపుకార్డును తమ వెంట తెచ్చుకోవాలన్నారు.