హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సమాచార సాంకేతిక రంగంలో విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించేందుకు రాష్ట్ర ఉన్న త విద్యామండలి దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సహకారంతో ప్రత్యేక వెబ్పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ అంశంపై మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, టీసీఎస్ ప్రాథమిక చర్చలు జరిపాయి. నేషనల్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ తరహాలో స్టేట్ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ పోర్టల్ను తీసుకొచ్చేందుకు సహకరిస్తామని టీసీఎస్ ప్రతినిధులు చెప్పడంతో ఉన్నత విద్యామండలి అధికారులు పచ్చజెండా ఊపారు. డాటాసైన్స్ విద్యార్థులకు టీసీఎస్ నిపుణులతో పాఠాలు బోధించేందుకు ఆ సంస్థతో ఒప్పందం కుదిరిం ది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సమక్షంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వేంగుస్వామి రామస్వామి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. దీంతో రాష్ట్రంలోని 124 కాలేజీల్లో డాటా సైన్స్ విద్యార్థులకు టీసీఎస్ రూపొందించిన పాఠ్యాంశాలను బోధించడంతోపాటు ప్రాక్టికల్స్, ఇంటర్న్షిప్లను నిర్వహించనున్నారు. టీసీఎస్ నిర్వహించే ‘నేషనల్ క్వాలిఫయింగ్ టెస్ట్’కు ఉచితంగా హాజరయ్యే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు. టీసీఎస్తోపాటు అనేక కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్లకు ఈ టెస్ట్ను ప్రమాణికంగా తీసుకొంటున్నాయి. కార్పొరేట్లతో విద్యార్థులు కనెక్ట్ అయ్యేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు సువర్ణావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ లింబాద్రి, సభ్యుడు నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.