హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ, గొర్రెల సంపదలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. రూ.5 వేల కోట్లతో చేపట్టిన మొదటివిడత గొర్రెల పంపిణీ అద్భుత ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. మొదటివిడతలో 79.16 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా.. వీటికి 1.30 కోట్ల పిల్లలు పుట్టాయని తెలిపారు. వీటి విలువ సుమారు రూ.7,800 కోట్లు ఉంటుందని చెప్పారు. 93 వేల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.91 కోట్ల గొర్రెలు ఉన్నట్టు కేంద్రమే తెలిపిందని ఆయన గుర్తుచేశారు. రెండోవిడత గొర్రెల పంపిణీ, పశు సంవర్ధశాఖ ఇతర అంశాలపై శనివారం ఎంసీఆర్హెచ్చార్డీలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ గొల్ల కురుమలను దేశంలోనే ధనిక గొల్ల కురుమలుగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రూ.6 వేల కోట్లతో రెండోవిడత గొర్రెల పంపిణీని చేపడుతున్నామని, ఇప్పటికే హుజూరాబాద్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించామని పేర్కొన్నారు. రెండోవిడత పంపిణీ కోసం యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు పెంచినట్టు వెల్లడించారు. ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. దీన్ని ఈ నెల 6న గజ్వేల్లో ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.