హైకోర్టు కొత్త న్యాయమూర్తులు వీరే
పీ శ్రీసుధ, డాక్టర్ సీ సుమలత, డాక్టర్ జీ రాధారాణి, ఎం లక్ష్మణ్, ఎన్ తుకారాంజీ, ఏ వెంకటేశ్వర్రెడ్డి, పీ మాధవీదేవి
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. వీరందరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సెప్టెంబర్ 2న హైకోర్టు సీజేగా పదవీ విరమణ చేయనున్న దశలో జస్టిస్ హిమాకోహ్లీకి పదోన్నతి లభించబోతున్నది. దీంతో ఆమె మరో మూడేండ్లపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగే వరకూ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు తాత్కాలిక సీజేగా బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నది. కొలీజియం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ వెలువరిస్తుంది. తర్వాత కొత్త న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరిస్తారు.
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ జిల్లా జడ్జీలకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించబోతున్నది. న్యాయమూర్తులు పీ శ్రీసుధ, డాక్టర్ సీ సుమలత, డాక్టర్ జీ రాధారాణి, ఎం లక్ష్మణ్, ఎన్ తుకారాంజీ, ఏ వెంకటేశ్వర్రెడ్డి హైకోర్టు న్యాయమూర్తులు కాబోతున్నారు. వీరితోపాటు ఆదాయం పన్నుశాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలిగా ఉన్న పీ మాధవీదేవిని కూడా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కొలీజియం సిఫారసు చేసింది.
చాలాకాలంగా జిల్లా జడ్జీల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించలేదు. 24 మందితో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత జిల్లా జడ్జీలకు పదోన్నతి లభించడం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం హైకోర్టులో 12 మంది (సీజేతో కలిపి) న్యాయమూర్తులు ఉన్నారు. కొత్తగా ఏడుగురు నియమితులైతే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరుగుతుంది. ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగితే ఆ సంఖ్య 19కి చేరుతుంది. అప్పుడు కూడా 23 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉంటాయి. తర్వాత నియామకాలు చేస్తే బార్ నుంచి న్యాయవాదులకు అవకాశాలుంటాయని భావిస్తున్నారు.
హైకోర్టు ప్రతిపాదన మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఏడుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 16న సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన కొలీజియం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఏడుగురు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. వీరిలో నలుగురు మహిళలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయి. కొత్త న్యాయమూర్తుల నియామకాలు పూర్తి అయితే సత్వర న్యాయం జరిగేందుకు వీలౌతుంది.
1967 జూన్ 6న పుట్టారు. నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా 2002లో నియమితులయ్యారు. పలు జిల్లాల్లో, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా చేశారు. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల చీఫ్ జడ్జిగా పనిచేశారు, ఉమ్మడి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు.
1972 ఫిబ్రవరి 5 న నెల్లూరు జిల్లాలో పుట్టారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. మదనపల్లి, కర్నూలు, గుంటూరు జల్లాల్లో జడ్జిగా విధులు నిర్వహించారు. ఉమ్మడి జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడం అనే అంశంపై డాక్టరేట్ చేశారు.
1963 జూన్ 29 న జన్మించారు. ఏలూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తూ 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. హైదరాబాద్లోని పలు కోర్టుల్లో జడ్జిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాకు చెందిన 1965 డిసెంబర్ 24న జన్మించారు. హైదరాబాద్లోని పలు కోర్టుల్లో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నగరంలోని పలు కోర్టుల్లో, ఖమ్మం జిల్లా చీఫ్ జడ్జిగా పనిచేశారు. ప్రస్తుతం లేబర్కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.
1973 ఫిబ్రవరి 24న జన్మించారు. హైదరాబాద్లో చదువుకొన్నారు. 2007లో జిల్లా జడ్జిగా ఎన్నికయ్యారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి జిల్లా చీఫ్ జడ్జిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు.
మహబూబ్నగర్కు చెందిన ఏ వెంకటేశ్వర్రెడ్డి 1961 ఏప్రిల్ 1న పుట్టారు. జిల్లా జడ్జిగా 1994లో ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లాతోపాటు పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన పీ మాధవీదేవి 1965 డిసెంబర్ 28న జన్మించారు. గుల్బర్గా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఉస్మానియాలో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. 1992లో అడ్వొకేట్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2005లో ఆదాయం పన్నుశాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) సభ్యురాలిగా హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. ముంబై, బెంగళూరులో కూడా ఐటీఏటీ సభ్యురాలిగా చేశారు.