హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సీజేఐతో భేటీ అనంతరం ఎస్ఈసీ పార్థసారథి మాట్లాడుతూ.. తెలుగువారైన జస్టిస్ ఎన్.వి.రమణ సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలను మరింత సమర్థవంతంగా , రాజ్యాంగబద్దంగా నిర్వహించడానికి ప్రధాన న్యాయమూర్తి సలహా సూచనలు కోరినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ధనం, మద్యం ప్రభావాన్ని అరికట్టడానికి తీసుకురావాల్సిన సంస్కరణల గూర్చి చర్చించినట్లు ఎస్ఈసీ వెల్లడించారు.