విజయవాడ : తెలంగాణ ఎస్ఈసీ పార్దసారథి దంపతులు శుక్రవారం సాయంత్రం బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాడ మాసం శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎస్ఈసీ దంపతులు సి.పార్థ సారథి, శ్రీమతి శోభా పార్థసారథి, ఇతర కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్నారు. భక్తి ప్రపత్తులతో కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాడం సారె సమర్పించి, మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భ్రమరాంబ లడ్డూ ప్రసాదాలను, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
అనంతరం ఆలయ గోపురం బయట ప్రత్యేక మండపంలో వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల ప్రతిమలను తెలంగాణా పార్థసారథి దంపతులు, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో భ్రమరాంబ కనకదుర్గమ్మ అమ్మవారి శాకాంబరీ ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ దర్శన కార్యక్రమంలో ఎస్ఈసీ పార్దసారథి వెంట కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ఈవోభ్రమరాంబ, ప్రణాళిక శాఖ జాయింట్ సెక్రటరీ కోటేశ్వరమ్మ, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత, ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ కార్యాలయ జేడీ సాయి, రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక తాహసీల్దార్ మాధురి తదితరులు ఉన్నారు.