హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ప్రకటించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాం డ్ చేశారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుతోపాటే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పిస్తూ ప్రతిపాదనలను క్యాబినెట్కు పంపాలని కోరారు. కాళేశ్వరానికి గుర్తింపు కోసం ఐదేండ్లుగా పోరాడుతున్న విషయాన్ని శనివారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్ 2016 ఫిబ్రవరి 11న ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇచ్చేదిలేదని 2018లో కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పారని, కానీ రెండురోజుల క్రితం అప్పర్ భద్ర ప్రా జెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చిందని, రూ.16,125 కోట్లు రాబోతున్నాయని స్వయం గా కర్ణాటక సీఎం యెడియూరప్ప శుక్రవారం ట్వీట్ చేశారని గుర్తుచేశారు. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు కల్పించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.