సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్లుగా పోలీసులు సేవలందిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న సిబ్బందిలో ఎప్పటికప్పుడు మనో ధైర్యాన్ని నింపుతూ మేమున్నామని నగర పోలీసు ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు. పగలు, రాత్రి వేళల్లో రోడ్లపై ఉండే పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో కన్ఫరెన్స్ల ద్వారా ఆయా స్టేషన్ల హెచ్ఓలతో కరోనా పరిస్థితులు, సాధారణ క్రైమ్కు సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తుండటంతో కిందిస్థాయి అధికారుల్లో మనోధైర్యం పెరుగుతున్నదని పలువురు సిబ్బంది పేర్కొంటున్నారు. ఉద్యోగాలు చేయడమే కాదు, కుటుంబ సభ్యుల శ్రేయస్సుకూడా ముఖ్యమేనని, వారికి కూడా వ్యాక్సినేషన్ చేయించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సిబ్బందికి దిశా నిర్ధేశం చేస్తున్నారు.