హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దళితబంధుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని, ఈ పథకాన్ని అడ్డుకోజూస్తున్న వారంతా దళిత ద్రోహులేనని టీఎస్ఎమ్మార్పీఎస్ నేతలు విమర్శించారు. నోటికాడి ముద్దను గుంజుకునే కుట్రలకు పాల్పడుతున్న దళితద్రోహులను వదిలిపెట్టబోమని, అలాంటివారికి రాజకీయంగా బుద్ధిచెప్తామని హెచ్చరించారు. దళిత బంధును ప్రకటించిన నేపథ్యంలో టీఎస్ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో టీఎస్ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొట్టపెంజర రమేశ్, ఎమ్మెస్సెఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వొరిగడ్డి చందు తదితరులు ఉన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు ద్వారా దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని అన్నారు. దళితజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పథకానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ను అభినవ అంబేద్కర్గా అభివర్ణించారు. కేసీఆర్ అడుగుజాడల్లో ఇతర రాష్ర్టాల సీఎంలు నడవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. గత పాలకులు దళితులను ఓట్లేసే యంత్రాలుగానే చూశారని విమర్శించారు. దళితబంధు పథకాన్ని తామే స్వయంగా ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పారు.