హైదరాబాద్/నెట్వర్క్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరు ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు ను ప్రదర్శించింది. ఈనెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూర్, నకిరేకల్ మున్సిపాలిటీలకు పోలింగ్ జరనున్నది. దాదాపు వారం రోజులపాటు జరిగిన ప్రచారంలో టీఆర్ఎస్ శ్రేణు లు ఇంటింటి ప్రచారాన్ని హోరెత్తించారు. చివరి రోజైన మంగళవారం కూడా గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంబంధిత మంత్రులు పూర్తి బాధ్యతను తీసుకొని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన పరిణామాలు, అభ్యర్థుల ఎంపిక, అనుసరించిన ప్రచార వ్యూహానికి తోడు ఆరున్నరేండ్లలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చ జరిగింది. అంతేకాకుండా ఆయా మున్సిపాలిటీల రూపురేఖలు మారడం కండ్లముందు కనిపిస్తున్న దృశ్యానికి ప్రజలు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. పార్టీ బలం, ప్రజాబలం, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వెరసి రెండు, కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లోనూ మరోసారి గులాబీ జెండా ఎగురవేయటం ఖాయంగా తేలిపోయిందని మంత్రులు, ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రభావం పెద్దగా కన్పించలేదు. టీఆర్ఎస్ దూకుడుగా సాగడంతో ఆయా పార్టీల ప్రచారం పెద్దగా సాగలేదు.
అభివృద్ధి చూసి ఆశీర్వదించండి: హరీశ్రావు
బీజేపీ నాయకులు చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చివరి రోజైన మంగళవారం సిద్దిపేటలోని పలు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర సమయంలో కన్పించని విపక్ష నాయకులు నేడు ఎన్నికలు అనగా ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ధి మరింత జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి: జగదీశ్రెడ్డి
కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లోని మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. 2014లో వేసిన మీ ఓటు కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిందని, ఆ ఓటుతోనే తెలంగాణ ప్రజల తలరాతలు మారాయన్నారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తారని చెప్పా రు. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లోఅభివృద్ధి చేసే అధికార పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు పాల్గొన్నారు.