హైదరాబాద్ : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు అలుపెరుగకుండా శ్రమించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తన ఛాంబర్లో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి దశలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తుదిశ్వాస వరకు ఉద్యమించిన మహానుభావుడు జయశంకర్ సార్ అని కొనియాడారు.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ జయశంకర్ ఆశయాలను సాకారం చేస్తున్నారని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. తెలంగాణకు జయశంకర్ సార్ చేసిన సేవల్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.