ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం
తొలి ప్రాధాన్యతతోపాటు
ఎలిమినేషన్ రౌండ్స్లోనూ పైచేయి
రెండు, మూడు స్థానాల్లో తీన్మార్
మల్లన్న, కోదండరాం
సుదీర్ఘంగా సాగుతున్న లెక్కింపు ప్రక్రియ
ఎలిమినేషన్ రౌండ్స్కు 40 గంటలకు పైనే..
నేటి మధ్యాహ్నానికి తుది ఫలితం వచ్చే చాన్స్
62 మంది స్వతంత్రుల ఓట్లు 5,966 మాత్రమే
మొత్తం చెల్లని ఓట్లు 21,636
నల్లగొండ ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ పట్టణంలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. బ్యాలెట్ పత్రాలను కట్టలుగా మార్చడంతో మొదలైన ప్రక్రియలో అదేరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 34గంటల పాటు కొనసాగగా మొత్తం 387969 ఓట్లను లెక్కించారు. ఒక్కో రౌండ్లో 56టేబుళ్లపై 56వేల ఓట్లను లెక్క ఎనిమిది హాల్స్లో లెక్కపెట్టారు. అయితే ఒక్కో రౌండ్కు సగటున ఐదుగంటల సమయం తీసుకుంది. చివరగా శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు ఏడో రౌండ్ కౌంటింగ్తో ఇది ముగిసింది.
పల్లా ముందంజ
తొలి ప్రాధాన్యత ఓట్లలో మొత్తం 3,66,333 ఓట్లు చెల్లగా అందులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 1,10,840 ఓట్లతో ప్రథమ స్థానం, 83,290 ఓట్లతో తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో, 70,072ఓట్లతో కోదండరాం మూడో స్థానంలో 39,107 ఓట్లతో బిజేపీ ప్రేమేందర్రెడ్డి నాల్గో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్ 27,588ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అయితే మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. అన్ని రౌండ్స్ ముగిసే సరికి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించారు. ఈ క్రమంలో చెల్లిన ఓట్లలోంచి 1,83,168 ఓట్లతో గెలుపుకోటాను నిర్ధారించారు. అయితే అభ్యర్దుల్లో ఎవరికీ గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు లభించలేదు. దీంతో తొలుత ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందులో తొలి ప్రాధాన్యత ఓట్లలో చివరి స్థానంలో ఉన్న అభ్యర్ధిని ఎలిమినేషన్ చేస్తూ అతనికి వచ్చిన బ్యాలెట్లలో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఇతరులకు పంచుతూ లెక్కింపును కొనసాగించారు.
సుదీర్ఘంగా ఎలిమినేషన్ రౌండ్స్
ఎలిమినేషన్ రౌండ్స్ కూడా సుదీర్ఘ సమయాన్నే తీసుకుంటున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ముందుగా దీనిపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత గెలుపు కోటా కోసం ఎలిమినేషన్ రౌండ్స్ను ప్రారంభించారు. ఆర్ఓ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎలిమినేషన్ రౌండ్స్లో బరిలో ఉన్న మొత్తం 71మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిని తొలిగించుకుంటూ వారికి వచ్చిన ద్వితీయ తర్వాత ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కొనసాగించారు. ముందుగా ఎనిమిది తొలి ప్రాధాన్యత ఓట్లను కలిగిన ఎం.వెంకట్రెడ్డి అనే స్వతంత్ర అభ్యర్థి నుంచి దీన్ని మొదలుపెట్టారు. ఇలా ఎలిమినేట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగిలిన వారికి జత చేస్తూ దీన్ని కొనసాగిస్తున్నారు.
62మందికి 5,966 ఓట్లే..
శుక్రవారం రాత్రి పది గంటల వరకు 60మంది అభ్యర్థుల వరకు ఎలిమినేట్ అయ్యారు. చివరి నుంచి 62మంది అభ్యర్థులకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓట్లు కేవలం 5,966 ఓట్లు మాత్రమే కావడం గమనార్హం. అయినా వీరందరినీ ఎలిమినేట్ చేస్తూ లెక్కింపు కొనసాగించేందుకు 18గంటల సమయం తీసుకుంది. వీరి తర్వాత కూడా మిగిలిన ప్రధాన అభ్యర్థుల ఎలిమినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ అభ్యర్థులకు వేలల్లో ఓట్లు ఉండడంతో ఒక్కో అభ్యర్థి ఎలిమినేషన్కు మరింత సమయం తీసుకోనుంది. అధికారుల అంచనా ప్రకారం శనివారం సాయంత్రం తర్వాతే తుది ఫలితం రావచ్చని తెలుస్తున్నది. శుక్రవారం సాయంత్రం 6గంటలకు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా కనీసం 24గంటల సమయం తర్వాత విజేత ఖరారు కావచ్చని స్పష్టం చేశారు.
ఇదే జరిగితే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కనీసం 40గంటల సమయం పట్టనుంది. మొత్తంగా చూస్తే కౌంటింగ్ ప్రక్రియ 80గంటలకు పైగానే సాగుతున్నట్లు చెప్పవచ్చు. ఎలిమినేషన్ రౌండ్స్లో చివరి ముగ్గురు అభ్యర్థులు మిగిలినప్పుడు ఇందులోనూ తక్కువ ఓట్లతో ఉన్న మూడో అభ్యర్థి ఎలిమినేషన్కు గురవుతారు. ఇది ఎవరనేది చివరలో తేలనుంది. ఎలిమినేషన్ రౌండ్స్లో జత అవుతున్న ఓట్ల ఆధారంగా ఆ అభ్యర్థి ఎవరనేది నిర్ధారణ కానుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉన్న లెక్కల ప్రకారం కోదండరామ్నే ఎలిమినేషన్ కావచ్చన్నది అంచనా. ఒక వేళ ఎలిమినేషన్ రౌండ్స్లో మల్లన్న కంటే భారీ ఓట్లు సాధిస్తూ అంతకు ముందు మల్లన్న ఓట్లతో పోలిస్తే ఉన్న 13వేల లోటు ఓట్లను అధిగమించ గలిగితే కోదండరాం బరిలో మిగులుతారు. వీరిద్దరిలో ఎవ్వరూ ఎలిమినేషన్కు గురయినా అనంతరం అత్యధిక ఓట్లను కలిగి ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి విజేత కానున్నారు.
కడపటి వార్తలు అందే సమయానికి..
చూదగాని హరిశంకర్, షబ్బీర్ ఎలిమినేషన్కు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థి బరిగల దుర్గాప్రసాద్, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్, యువ తెలంగాణ అభ్యర్థి రాణిరుద్రమ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. వీరి తర్వాత సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాములునాయక్, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని ఎలిమినేషన్కు వెళ్లనున్నారు. చివరగా మిగిలిన ముగ్గురిలో అత్యధిక ఓట్లు కలిగిన పల్లా రాజేశ్వర్రెడ్డిని మినహాయిస్తే.. కోదండంరాం, తీన్మార్ మల్లన్నలో ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వారి ఎలిమినేషన్ వెళ్లాల్సి ఉంటుంది.
చెల్లని ఓట్లు 21,636
పట్టభద్రుల ఎన్నికల్లోనూ ప్రతిసారి చెల్లని ఓట్లు భారీగా ఉంటుండడం చర్చనీయాంశంగా మారుతున్నది. అభ్యర్థుల ప్రచారంలో, సోషల్ మీడియాలో, అధికారికంగానూ ఎంత అవగాహన కల్పిస్తున్నా పట్టభద్రులు ఓటు వేయడంలో తడబాటుకు గురవుతూనే ఉన్నారు. ఈ సారి కూడా చెల్లని ఓట్లు భారీగానే ఉంటున్నాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసే సరికి మొత్తం 3,87.969 ఓట్లకు గానూ 21,636 ఓట్లు చెల్లనివిగా నిర్ధారణ చేశారు. అంటే మొత్తం ఓట్లలో ఇది 5.57శాతంగా ఉన్నాయి. అయితే 2015 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలతో పోలిస్తే ఈ సారి చెల్లని ఓట్ల 40శాతం తగ్గిపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. కిందటిసారి 9.14శాతంతో 14వేల పైచిలుకు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక పోస్టల్ బ్యాలెట్లలోనూ సరైన నిబంధనలు పాటించని కారణంగా 1917ఓట్లకు గానూ 79ఓట్లు చెల్లకుండా పోవడం గమనార్హం.