హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణ పరిధి అవినీతి నిరోధక కేసుల విచారణ కోర్టుకు (ఏసీబీ కోర్టు) లేదని హైకోర్టులో దాఖలు చేసిన కేసు వీగిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటు కొనుగోలు నిమిత్తం రూ.50 లక్షలను రేవంత్రెడ్డి ఇస్తుంటే ఏసీబీ శాఖ ప్రత్యక్షంగా పట్టుకున్నట్లుగా కేసు నమోదు చేసింది. ఈ కేసును ఏసీబీ కోర్టుకు విచారించే పరిధి లేదని, ఎన్నికల కేసులను విచారించే కోర్టు పరధిలోకి వస్తుందని, ఇందకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ రేవంత్రెడ్డి దాఖలు చేసిన రిట్ను డిస్మిస్ చేసింది. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేసే నిమిత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తుంటే పట్టుకున్నట్లుగా, ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది ఎన్నికల వివాదం కిందకు వస్తుందని, ఏసీబీ కేసు అవ్వదని రేవంత్రెడ్డి ఏసీబీ కోర్టులో కేసు వేస్తే గతంలోనే చుక్కెదురైంది. ఏసీబీ కోర్టు ఈ ఏడాది జనవరి 21న కొట్టేస్తూ తీర్పు చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ తరఫున న్యాయవాది చేసిన వాదన వీగిపోయింది. ఏసీబీ కేసు పెట్టినప్పుడు పిటిషనర్ రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది. స్టీఫెన్సన్ ఓటు టీడీపీకి అనుకూలంగా వేయాలని రూ. అర కోటి ఎర ఇచ్చారని ఏసీబీ కేసు పెట్టింది. ఎన్నికల షెడ్యూల్ 2015 జూన్ 1 వరకూ అమల్లో ఉన్నప్పుడు ఏసీబీ కేసు చెల్లబాటు అవ్వదు. ఎలక్షన్ కేసు అవుతుంది. ఇదే విషయాన్ని కింది కోర్టుకు చెబితే ఫలితం లేకపోయింది.
ఎన్నికల్లో లంచం ఇవ్వడం అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదు. ఐపీసీలోని సెక్షన్ 171బి కింద ఎలక్షన్ కేసు అవుతుంది. ఇదే జరిగితే ఐపీసీలోని 171 ఇ కింద శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఏసీబీ కోర్టు తీర్పును రద్దు చేయాలి. ఎలక్షన్ కేసని ఉత్తర్వులు ఇవ్వాలి.. అని రేవంత్రెడ్డి న్యాయవాది చేసిన వాదనను హైకోర్టు కొట్టేసింది. ఈ వాదనను ఏసీబీ తరఫు న్యాయవాది రవికిరణ్రావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే కేసులో మ రెండు, మూడు, నాలుగు నిందితులు వేసిన డిశ్చార్జి పిటిషన్లను ట్రయిల్ కోర్టు కొట్టేసిందని, ఈ ఉత్తర్వులను హైకోర్టు ఆమోదించిందని చెప్పారు.
ఒకసారి కింది కోర్టు నిర్ణయాన్ని వెలువరించాక దానిని ఆకోర్టే సమీక్ష చేసే అధికారం లేదన్నారు. స్టీఫెన్సన్కు లంచం ఇస్తూ పట్టుబడ్డారని, రూ.50 లక్షల నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుందని, ఇలాంటి పరిస్థితుల్లో కేసు విచారణకు అవరోథకం కల్పించేందుకే పిటిషనర్ రేవంత్రెడ్డి ఈ తరహా కేసు వేశారని అన్నారు. లంచం ఇవ్వడం అవినీతి కిందకే వస్తుందని, ఏవిధంగా చూసినా, చట్ట నిబంధనలను పరిశీలించినా లంచం ఇవ్వడం కిందకే వస్తుందన్నారు. ఎన్నికల వివాదం కిందకు కేసు రాదన్నారు. వాదనల తర్వాత రేవంత్రెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. రేవంత్రెడ్డి ఇతరులపై ఏసీబీ నమోదు చేసిన కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు ఉందని స్పష్టం చేసింది.