నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించింది. కానీ దళిత జాతి మాత్రం వెనుకబడి ఉంది. వందకు వంద శాతం, ఆరునూరైనా సరే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తాం అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై హాలియాలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు.
ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజల ఆదరణ ఉన్నంత వరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తాం. దళిత బంధుపై విపక్షాలు ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో 16 నుంచి 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 12 లక్షల దళిత కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. బ్యాంకుతో సంబంధం లేకుండా ఈ నిధులు ఇస్తామన్నారు.
దళిత సోదరుల అభివృద్ధిని కాంక్షించి ఈ పథకానికి రూపకల్పన చేశామన్నారు. వచ్చే ఏడాది నుంచి పెద్దమొత్తంలో డబ్బులు మంజూరు చేసి అమలు చేస్తామన్నారు. రూ. 1200 కోట్లతో దళిత బంధును అమలు చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు వచ్చే విధంగా అమలు చేస్తామన్నారు. ఈ పథకం అమలైతే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు అని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. వందకు వంద శాతం, ఆరునూరైనా సరే ఈ పథకాన్ని అమలు చేస్తాం. భారత దళిత జాతికే తెలంగాణ దళిత జాతి ఆదర్శంగా తయారవుతుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.