హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కు చెందిన 16 ఫ్రంట్ సంస్థలను చట్టవిరుద్ధ సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటి కార్యకలాపాలపై ఏడాదిపాటు నిషేధం విధించింది. ఈ నిషేధం 30 మార్చి,2021 నుండి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ సంస్థలు హింస, బెదిరింపులకు పాల్పడటం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజా భద్రతా చట్టం -1992 లోని నిబంధనల ప్రకారం ప్రభుత్వం 16 ఫ్రంట్ సంస్థలపై నిషేధం ప్రకటించింది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంగటిత కార్మిక సాంఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదికా (టీవీవీ), డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్(డీఎస్యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ (ఎఎస్యు), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సీఆర్పీపీ),
తెలంగాణ రైతాంగ సమితి, తుడుం దెబ్బా (టీడీ), ప్రజా కళా మండలి (పీకేఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్), ఫోరమ్ ఎగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఫాఫ్ఫో), సివిల్ లిబర్టీస్ కమిటీ (సీఎల్సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్), రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యుఎ)ను చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రభుత్వం పేర్కొంది.