కొచ్చి: కేరళకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు, మాతృభూమి టీవీ సీనియర్ రిపోర్టర్ విపిన్ చంద్ (42) కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. రెండు వారాల క్రితం కరోనా వైరస్ బారినపడ్డ విపిన్ చంద్ కొన్నిరోజులపాటు హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
ఎర్నాకుళం జిల్లాలో ఆలంగాడ్లో జన్మించిన ఆయన విధ్యాభ్యాసం పూర్తయిన తర్వాత 2005లో జర్నలిజమ్ వృత్తిని కేరీర్గా ఎంచుకున్నారు. వివిధ ఛానెళ్లలో పనిచేసిన ఆయన 2012లో మాతృభూమి న్యూస్ ఛానెల్లో చేరి చనిపోయే వరకు అందులోనే ఉన్నారు. కాగా, విపిన్ చంద్ మృతికి కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితాల సంతాపం తెలియజేశారు.