స్వార్థ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం
ఉద్యమ నాయకులను అణగదొక్కారు
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు
హుజూరాబాద్, ఏప్రిల్ 5: ‘మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ అవకాశవాది.. రాజకీయ స్వార్థం కోసం ఉద్యమకారులకు అణగదొక్కారు’ అంటూ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నిప్పు లు చెరిగారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచి పరాయి పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని దళితులకిచ్చిన అసైన్డ్ భూములను కొల్లగొట్టాడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్కు గతంలో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన స్వార్థం కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెట్టారని దుయ్యబట్టారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత అధికారాన్ని కాపాడుకునేందుకు పాకులాడారని, పదవిని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేయడమే కాకుండా.. ప్రభుత్వం కొనడం లేదా అని ప్రశ్నించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. 66 ఎకరాల అసైన్డ్ భూమి ఒక మంత్రిగా కొనుగోలు చేయడంలో అంతర్యమేంటన్నారు. రాజేందర్కు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని, ఆయనకు ఎన్నో ఉన్నత పదవులు కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. హుజూరాబాద్, కమలాపూర్ నియోజవర్గాల్లో ప్రతి గ్రామాన గులాబీ జెండాను ఎగరేసి పార్టీ బలోపేతానికి తానే కృషి చేశానని చెప్పారు.
ఉద్యమం మొదటి రోజుల్లో ఈటల కృషి ఏమి లేదని, అప్పటికే ఉవ్వెత్తున లేస్తున్న ఉద్యమ సమయాన కమలాపూర్ నుంచి పోటీచేసి గెలిచాడని చెప్పారు. బీసీ వర్గాల నేతగా ఈటల రాజేందర్కు సీఎం చంద్రశేఖర్రావు ఫ్లోర్ లీడర్, ఆర్థిక, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖ వంటి పదవులను ఇస్తే.. సీఎం పైనే అసంతృప్తి వెల్లగక్కడం సరైన పద్ధతికాదన్నారు. అంతేకాకుండా పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజవర్గం విడిపోయి హుజూరాబాద్గా ఏర్పడగా ఈటల కోసం తాను త్యాగం చేసి హుస్నాబాద్కు వెళ్లానని తెలిపారు. కేసీఆర్ పాలనకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నిక, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే నిదర్శనమన్నారు. దేశంలో నే ఎక్కడా లేనివిధంగా బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘ నత కేసీఆర్కు దక్కుతుండగా, వాటిని బహిరంగంగానే విమర్శించడం దేనికి సంకేతమన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకోసం నియోజవర్గంలో ఉద్యమ నాయకులెవరినీ ఎదగనీయలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హుస్నాబాద్ రెవె న్యూ డివిజన్గా ఏర్పడితే దానిని గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేయించి హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్గా చేయడం రాజకీయ కుట్రకాదా..? అని ప్రశ్నించారు. ఎంపీపీగా సరోజనీదేవిపై అవిశ్వాసం పెడితే దానిపై ఏమి మాట్లాడకపోవడంలో అంతర్యమెంటో చెప్పాలని డిమాండ్ చేశారు.