హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని, అన్ని రకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్కు వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. మంత్రివర్గ సమావేశంలో వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ చర్చించారు. మొదటగా కొవిడ్ పరిస్థితిపై చర్చించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్కు సమాచారం అందించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో వుందని తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో వున్నాయని వివరించారు.
2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని సీఎం కేసీఆర్కు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 2 కోట్ల 56 వేల 159 డోసులు అందించినట్లు చెప్పారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నేటి నుంచి ప్రారంభమైందని తెలిపారు. ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసిలు, ఎంపీపీ, జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితిర ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలన్నారు. ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కేబినెట్ నిర్దేశించింది. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే వుండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని తెలిపారు.
వచ్చే సంవత్సరం నుండి కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై కెబినెట్ సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని కెబినెట్ ఆదేశించింది.
ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా వస్తే ఆ పరిస్థితులను ఎదర్కోవడానికి సిధ్దంగా వున్నామని వైద్యాధికారులు కేబినెట్కు వివరించారు. రూ. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని సమకూర్చామని తెలిపారు. చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్ది కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించింది.