హైదరాబాద్ : ధాన్యం దిగుబడి పెరుగుతున్నందున రాష్ట్రంలో రైస్ మిల్లులను మరింతగా ఏర్పాటు చేయాల్సిన అవసరం పెరిగిందని, అందుకోసం తగు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. ధాన్యం సేకరణను పూర్తిగా చేపట్టకుండా తెలంగాణ పట్ల కేంద్రం అవలంబిస్తున్న అనుచిత వైఖరి గురించి చర్చించిన కేబినెట్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్లో జరిగింది. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో మంత్రివర్గం పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంది.
రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణ గురించి చర్చించిన కేబినెట్ 87 శాతం ధాన్యం సేకరణ జరగడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. వరి ధాన్యంలో సన్నాలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందనే విషయం మీద సమావేశంలో చర్చ జరిగింది. పొరుగు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం డిమాండు రోజు రోజుకూ తగ్గుతున్న నేపధ్యంలో వరి కన్నా భవిష్యత్తులో పత్తికే ఎక్కువ లాభాలొస్తాయని కేబినెట్ అంచనా వేసింది. కందులకు కూడా మార్కెట్లో డిమాండున్న నేపథ్యంలో కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖకు కేబినెట్ సూచించింది.
రైతు బంధు ఆర్ధిక సాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు రైతులకు అందించాలని, యాసంగిలో జమ చేసిన విదంగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలను జమ చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. జూన్ 10 ని కటాఫ్ గా పెట్టుకుని, పార్ట్ బి నుంచి పార్ట్ ఏ లోకి మారిన భూముల వివరాలను అప్ డేట్ చేసుకోవాలని రెవిన్యూ, వ్యవసాయ శాఖల ను కేబినెట్ ఆదేశించింది. భూసారాన్ని పెంచడానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నది.