లక్నో: కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో వలస కార్మికులు మళ్లీ స్వంత ఊరి బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొత్త ఆంక్షలను ప్రకటించింది. వలస కార్మికులకు ఆ రాష్ట్రం క్వారెంటైన్ మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. బాంబే, పుణెతో పాటు ఇతర మహానగరాల నుంచి యూపీకి వలస వెళ్తున్న కార్మికులకు ఆ నియమావళి వర్తించనున్నది. ఉత్తరప్రదేశ్ అదనపు ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ ఆ మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన ప్రతి వలస కార్మికుడిని జిల్లా అధికారులు స్క్రీనింగ్ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలను ఉన్నవారిని 14 రోజుల పాటు హోం క్వారెంటైన్లో ఉంచాలని తెలిపారు. ఎటువంటి లక్షణాలు లేనివారిని ఏడు రోజుల పాటు హోం క్వారెంటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.