నిజామాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సృష్టిస్తున్న విలయ తాండవాన్ని కొండం త ధైర్యంతో ఎదుర్కోవాలని ఉభయ జిల్లాల యం త్రాంగానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొవిడ్ బాధితులకు ఏ లోటూ లేకుండా చికిత్స అందించాలని అన్నారు. ఉభయ జిల్లాల ప్రభుత్వ యంత్రాంగంతో ఆయన గురువారం వేర్వేరుగా సమీక్షలను నిర్వహించారు. హైదరాబాద్ నుంచి నేరుగా కామారెడ్డికి చేరుకున్న ఆయన.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్ శరత్తో కలిసి కామారెడ్డి జిల్లా ఏరియా దవాఖానను సందర్శించారు. కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్న వారితో నేరుగా సంభాషించారు. మీకు మేమున్నామంటూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మంత్రి వేముల భరోసాను కల్పించారు. బాధితులకు చికిత్సతోపాటు వారికి ఏమీ కాదన్న భరోసా కల్పించడమూ ముఖ్యమేనని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం నిజామాబాద్ కలెక్టరేట్లోనూ కొవిడ్ చికిత్సపై రివ్యూ నిర్వహించారు.
బ్లాక్ ఫంగస్పై ప్రత్యేక దృష్టి..
ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. డబుల్ మాస్కు వినియోగం, శానిటైజర్లు, భౌతికదూరం తప్పనిసరి అని చెప్పారు. అనవసరంగా బయట తిరిగి ఇతరులకు ఇబ్బందులు, కష్టాలు సృష్టించవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో 16మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉందని వివరించా రు. బోధన్, ఆర్మూర్, జీజీహెచ్లోనూ అన్ని సౌకర్యా లు కల్పించామని, కామారెడ్డి జిల్లా దవాఖానలో అదనంగా వంద బెడ్లకు, బాన్సువాడ ఏరియా దవాఖానలో 70 బెడ్లకు ఆక్సిజన్ ఏర్పాట్లు శనివారం వరకు పూర్తవుతాయని తెలిపారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విన్నపం మేరకు కామారెడ్డి జిల్లా దవాఖానలో అదనంగా ఐదు వెంటిలేటర్లు సమకూర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. పీపీఈ కిట్ల కోసం మంత్రి వేముల నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు ఫోన్ చేసి మాట్లాడారు.
సర్వే సక్సెస్..
కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు సీఎం కేసీఆర్ తలపెట్టిన జ్వర సర్వే కార్యక్రమం విజయవంతమైందని మంత్రి స్పష్టం చేశా రు. సర్వేలో పాల్గొన్న సిబ్బంది పకడ్బందీగా వివరాలను సేకరించారన్నారు. క్షేత్రస్థాయిలో బృందాలు కచ్చితమైన సమాచారాన్ని క్రోడీకరించడంతో ప్రస్తు తం కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి 10 శాతానికి తగ్గిందన్నారు. మన రాష్ట్రంలో సక్సెస్ అయిన జ్వర సర్వే ప్రక్రియను యావత్ దేశంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుండడం గర్వకారణమని మంత్రి చెప్పారు. జ్వర సర్వే అమలుపై స్వయంగా ప్రధాని మోదీ సైతం సీఎం కేసీఆర్ను అభినందించారని గుర్తుచేశారు. జ్వర సర్వేలో లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్లు ఇవ్వడంతో ఇంటి వద్దే చిన్నపాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారు కోలుకున్నారని మంత్రి వివరించారు. మరోవైపు ఈ సర్వేలో జ్వరాలతో ఇబ్బంది పడుతున్న వారంతా ప్రభుత్వం అందించిన కిట్లతో హోం ఐసొలేషన్ కావడం, సర్కారు ఇచ్చిన ఔషధాలు వాడడంతో కోలుకుంటున్నారని చెప్పారు.