న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బ్రిటన్కు చెందిన ప్రీమియం మోటర్సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంఫ్.. భారత మార్కెట్లోకి సరికొత్త ట్రైడెంట్ 660 మోడల్ బైక్ను ప్రవేశపెట్టింది. నాలుగు రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ ప్రారంభ ధరను రూ.6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మిడిల్ వెయిట్ రోడ్స్టర్ సెగ్మెంట్లో తీసుకొచ్చిన ఈ మోడల్ ధరను ప్రకటించకముందే 125 బుకింగ్స్ వచ్చినట్లు ట్రయంఫ్ ఇండియా వెల్లడించింది. లిక్విడ్ కూల్ 12 వాల్వ్ 3 సిలిండర్ 660 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, రెండు చక్రాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎల్ఈడీ లైట్లు, సెల్ఫ్ క్యాన్సెలింగ్ ఇండికేటర్లు, టీఎఫ్టీ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఈ బైక్ ప్రత్యేకతలు. ట్రైడెంట్ 660 బైక్ను ఎక్కువ మంది కొనుగోలు చేసేందుకు వీలుగా రూ.9,999 ఈఎంఐతో ప్రత్యేక ఫైనాన్స్ స్కీమ్ను ప్రవేశపెడుతున్నామని, అంతేకాకుండా ఈ బైక్ను కస్టమైజ్ చేసుకునేందుకు 45కు పైగా యాక్సెసరీస్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రకటించింది. కవాసకీ జడ్ 650, హోండా సీబీ 650ఆర్ లాంటి బైక్లకు ట్రైడెంట్ 660 గట్టి పోటీ ఇవ్వగలదని ట్రయంఫ్ భావిస్తున్నది.