హుజూరాబాద్ టౌన్, మే 19: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కానీ, అతని అనుచరులు కానీ బహిరంగ చర్చకు ఎందుకు రాలేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ ఇంచార్జి మెలుగు పూర్ణచందర్ ప్రశ్నించారు. బుధవారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఈటల అవినీతి, అక్రమాలపై, కొనుగోలు చేసిన భూములపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్చేసి తాము ముందుగానే ఇక్కడికి చేరుకున్నామని చెప్పారు. ఇదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పలుమార్లు సీఎం కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని కొనియాడిన ఈటల ఇప్పుడు ఆరోపణలు చేస్తుండటం సమంజసం కాదని హితవుపలికారు. బహిరంగచర్చకు రాలేని ఈటల మరోసారి ఎక్కడైనా ప్రెస్మీట్లో తాను నీతిమంతుడనని చెప్పుకొనే ముందు తన నిజాయితీని నిరూపించుకోలేదని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. మంగళవారం నిజమైన బీసీ నాయకుడు, మంత్రి గంగుల కమలాకర్ గురించి ఈటల రాజేందర్గా మాట్లాడారా? రాజేందర్రెడ్డిగా మాట్లాడారా? చెప్పాలని డిమాండ్చేశారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పుడల్లా కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి 20 రోజులు దాటినా ఏ నిర్ణయం తీసుకోకపోవడం వెనుక మళ్లీ గెలువనన్న భయం ఉన్నదని పేర్కొన్నారు. 2003లో ఈటల టీఆర్ఎస్ నాయకుడిగానే కమలాపూర్ నియోజకవర్గంలో అడుగు పెట్టారని, పార్టీ అధినేత కేసీఆర్ రాజేందర్కు ఎమ్మెల్యే, మంత్రిగా అవకాశం ఇస్తే ఆ విషయాన్ని మరచిపోయి కేసీఆర్పైనే ఆరోపణలు చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. మరోసారి సీఎంను, మంత్రులను విమర్శిస్తే హుజూరాబాద్లో తిరుగనీయమని హెచ్చరించారు. టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి ఆలేటి శ్రీరాం మాట్లాడుతూ.. తమ సవాల్ను ఎదుర్కొనలేక హుజూరాబాద్లోనే ఉండి బహిరంగ చర్చకు రాకుండా దొంగలా దాక్కున్న ఈటల.. టీఆర్ఎస్ అగ్రనాయకుల గురించి పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు. సమావేశంలో పోతరవేణి అనిల్యాదవ్ , గట్టయ్యయాదవ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.