హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): నీతి, నిజాయితీకి కట్టుబడే వ్యక్తిత్వం తనదని, తాను ఎవరినీ మోసం చేయలేదని లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. మధుకాన్ కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు. మధుకాన్ సంస్థలపై ఇటీవల జరిగిన ఈడీదాడులపై శనివారం హైదరాబాద్లోని నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2011లో జార్ఖండ్లోలో రాంచీ ఎక్స్ప్రెస్వే 160 కిలోమీటర్ల ప్రాజెక్టుతో మొదలైందని, రూ.1,600 కోట్ల ప్రాజెక్టులో రూ.460 కోట్లు కంపెనీ పెట్టుబడి అని.. మిగతా మొత్తం బ్యాంకు రుణంగా ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు.
బ్యాంకు రూ.652 కోట్లు ఇచ్చి, వడ్డీగా రూ.378 కోట్లు తీసుకున్నదని తెలిపారు. బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని వస్తున్న ఆరోపణలను ఖండించారు. అటవీశాఖ క్లియరెన్స్లు లేకపోవడం వల్ల ప్రాజెక్టు రద్దయిందని, ఆ సమయానికి 60 శాతానికి పైగా ప్రాజెక్టు పూర్తయిందని చెప్పారు. లావాదేవీలన్నీ ఎస్కూ అకౌంట్ ద్వారా జరిగాయని, ఈ తరహా అకౌంట్ను అపరేట్చేసే అవకాశం బ్యాంకుకే ఉంటుందని అన్నారు. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం పనిచేశామని స్పష్టంచేశారు.
కంపెనీకి జరిగిన అన్యాయానికి అర్బిట్రేషన్ ట్రిబ్యునల్కు వెళ్లిందని అన్నారు. దేశవ్యాప్తంగా బీవోటీ ప్రాజెక్టు నిబంధనలను కేంద్రం మార్పులు చేసిందని వివరించారు. ఎన్హెచ్ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి 80శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతమే ఇచ్చిందని తెలిపారు. ‘కంపెనీలో నేను ఎండీగా లేను. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్నది. 25న ఈడీ పిలిచింది. కచ్చితంగా హాజరవుతాను. అన్నింటికి సహకరిస్తాను. నీతి,నిజాయితీగానే ఉన్నా.
నేను ఎవర్నీ మోసం చేయలేదు అని నామా వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సీఎం కేసీఆర్తోనే తనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను సీఎం కేసీఆర్తోనే ఉంటానని నామా నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన నీతి, నిజాయితీపై నమ్మకం ఉంచి టీఆర్ఎస్ లోక్సభ నాయకుడిగా అవకాశం కల్పించారని, ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ముచేయనని తెలిపారు. ‘నా బలం సీఎం కేసీఆర్.. నా బలం ఖమ్మం ప్రజలు’ అని పేర్కొన్నారు. ‘20 ఏండ్ల నుంచి ప్రజాజీవితంలో ఉంటున్నా. 40 ఏండ్ల క్రితం మధుకాన్ కంపెనీని స్థాపించా. కంపెనీకి జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. నేను ప్రజాజీవితంలోకి వచ్చాక కంపెనీ వ్యవహారాలు సోదరులే చూసుకొంటున్నారు’అని తెలిపారు.