హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కమోడిటీల ర్యాలీలో కొద్దిరోజుల క్రితంవరకూ వెనుకబడిపోయిన వెండి, బంగారం ధరలు ఇప్ఫుడు హఠాత్తుగా పెరుగుతున్నాయి. ఈ రెండు విలువైన లోహాల్లో వెండి పెరుగుదల జోరుగా వుంది. గత నెలరోజులుగా పుత్తడి ధర 1.17 శాతం పెరగ్గా, వెండి ధర మాత్రం 7 శాతం ఎగిసింది. ఈ మంగళవారంకూడా ఇదేతీరున వీటి కదలికలు వున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 333 పెరిగి (0.7 శాతం) రూ. 47,833కు చేరింది. సోమవారం ఈ ధర రూ. 47,500. తాజాగా కేజీ వెండి ధర ఏకంగా రూ. 2,021 పెరిగి (2.84 శాతం) రూ. 73,122 వద్ద ముగిసింది. క్రితం రోజు ఈ ధర రూ. 71,101.
బంగారాన్ని మించి వెండి పెరగడానికి కారణాలున్నాయి. పుత్తడి ధరను ఆభరణాల డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ప్రభావితం చేస్తుంటాయి. పారిశ్రామిక డిమాండ్ వెండి ధరను పెంచుతూవుంటుంది. ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడితే పుత్తడి జోరుగా పెరుగుతుంది. గతేడాది కొవిడ్ సంక్షోభం తలెత్తినపుడు బంగారం పెద్ద ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ మార్కెట్లో పుత్తడి ఔన్సు ధర 2,000 డాలర్లను దాటగా, భారత్లో 10గ్రాముల ధర రూ. 55,000పైకి ఎగిసింది. ఆ సమయంలో వెండి ధర మాత్రం కనిష్టస్థాయిల్లో కొట్టుమిట్టాడింది. ఇప్పుడు కొవిడ్ ఉత్పాతం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బయటపడుతుందన్న విశ్వాసంతో ఇన్వెస్టర్లు బంగారానికి బదులు ఈక్విటీ మార్కెట్లతో పాటు పారిశ్రామిక వినియోగ లోహాల్లో నిధులు కుమ్మరిస్తున్న ఫలితంగా వెండి అధికంగా పెరుగుతోంది.
పారిశ్రామిక లోహాలైన అల్యూమినియం, రాగి, జింక్ తదితరాల ధరలు గత ఆరునెలల్లో రెట్టింపయ్యాయి. వీటితో పోలిస్తే ఇప్పటివరకూ వెండి వెనుకబడి వున్నందున, తాజా ర్యాలీ జరుగుతోంది. అమెరికా, చైనా మార్కెట్లలో వెండికి డిమాండ్ పుంజుకుంటున్నందున, ఈ లోహపు ధర మరింత పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. తాజా కమోడిటీ ర్యాలీలో పుత్తడి కూడా స్వల్పస్థాయిలో పాలుపంచుకోవడానికి కారణం డాలరు బలహీనంకావడమేనని వారు చెపుతున్నారు. ఇతర ప్రధాన కరెన్సీల విలువలతో పోలిస్తే డాలరు బలహీనపడిన సందర్భంలో కొద్దిపాటి పెట్టుబడులు బంగారంలోకి తరలి వస్తుంటాయి.