ముంబై, మే 25: కరోనా సెకండ్వేవ్తో తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని రంగాలకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం త్వరలో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ రంగాలపై సెకండ్వేవ్ ప్రభావాన్ని విశ్లేషించిన మీదట టూరిజం, ఏవియేషన్, హాస్పిటాలిటీ పరిశ్రమల పునరుత్తేజానికి తగిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయని, వీటికి ఆర్థికసాయం అవసరమని భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎమర్జన్జీ క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీము ద్వారా చిన్న పరిశ్రమలకు సాయం అందవచ్చని సూచనాప్రాయంగా వెల్లడించారు. దేశంలో 6.5 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు వున్నాయి. ఇవి జీడీపీలో 30 శాతం భాగస్వామ్యాన్ని కలిగివున్నాయి. అయితే స్థానిక లాక్డౌన్లు, నియంత్రణల ఎత్తివేత తర్వాతనే ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వుంటుందని ఆ వర్గాలు స్పష్టంచేశాయి. మరోవైపు ఆర్థికవ్యవస్థలో దృష్టిపెట్టాల్సిన విభాగాలు, కొవిడ్తో ప్రభావితమైన రంగాల్లో డిమాండ్ను ఎలా పెంపొందించాలన్న అంశాలపై నీతి ఆయోగ్ సైతం కసరత్తు చేస్తున్నదని వారు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను సునిశితంగా గమనిస్తున్నామని, ఉద్దీపన ప్యాకేజిపై ఆర్థికవేత్తలతో చర్చిస్తున్నట్లు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సంగతి తెలిసిందే.
రిజర్వుబ్యాంక్ నుంచి రూ.99,000 కోట్లు డివిడెండుగా అందినప్పటికీ, క్రితం ఏడాదిలా పెద్ద ఉద్దీపనను ఇచ్చే ఆర్థిక వెసులుబాటు మోది ప్రభుత్వానికి లేదని, ప్యాకేజీ చాలావరకూ పన్ను మినహాయింపులు, అదనపు గ్యారంటీల రూపంలోనే వుండవచ్చని నిర్మల్బంగ్ ఈక్విటీస్ ఎకానమిస్ట్ థెరెసా జాన్ అన్నారు. స్థానిక లాక్డౌన్ల ఎత్తివేత తర్వాత డిమాండ్ను పెంచే చర్యలు ఆ ప్యాకేజీలో వుండవచ్చని, వీటన్నింటికీ ప్రభుత్వం భారీగా వ్యయపర్చనవసరం లేదని ఆయన వివరించారు. ప్రభుత్వం చాలావరకూ బడ్జెట్లో ప్రతిపాదించిన వ్యయానికే కట్టుబడి వుండవచ్చని, వ్యయంలో మార్పుచేర్పులు&వైద్యసేవలు, ఆహారసబ్సిడీలకు అనుకూలంగా వుండవచ్చని బ్లూమ్బర్గ్ ఎకానమిస్ట్ అభిషేక్ గుప్తా చెప్పారు. 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 6.8 శాతానికి పరిమితంచేయాలని బడ్జెట్లో నిర్దేశించుకున్నందున, పరిశ్రమలపై వరాలజల్లు కురిపించే అవకాశాలు తక్కువేనని ఆయన అన్నారు. మరోవైపు కరోనా సెకండ్వేవ్తో తీవ్రంగా దెబ్బతిన్న రంగాలకు రుణ చెల్లింపు నిబంధనలు సరళతరం చేయాలన్న ఒత్తిడి రిజర్వుబ్యాంక్పై పెరుగుతోదని ఆయన చెప్పారు.