హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనాకు అత్యుత్తమ చికిత్స లభిస్తున్నది. హైదరాబాద్లోనేనని ఇతర రాష్ర్టాలకు చెందిన రోగులు చెప్తున్నారు. వైరస్ కట్టడికి, బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలే ఇందుకు కారణమని అంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్తోపాటు పలు రాష్ర్టాల నుంచి కరోనా బాధితులు హైదరాబాద్ వచ్చి కోలుకొని తిరిగి వెళ్తున్నారు. ఇలా వస్తున్నవారిలో పేద, మధ్యతరగతి వర్గాలతోపాటు సంపన్నులు కూడా అధిక సంఖ్యలో ఉండటం విశేషం. హైదరాబాద్లోని వివిధ కొవిడ్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారిలో ఇతర రాష్ర్టాలకు చెందినవారే 40% వరకు ఉన్నారని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా ఇతర రాష్ర్టాలకు చెందినవారు వచ్చి చికిత్స పొందుతున్నారు.
బెడ్ల కొరతకు ఇదే ప్రధాన కారణం..
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రేటు తక్కువగా ఉండగా, మన జనాభాకు అవసరమైన అన్ని సదుపాయాలు.. బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్, ఐసీయూ బెడ్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. కానీ ఇతర రాష్ర్టాలనుంచి సొంత వాహనాలు, బస్సులు, చివరికి విమానాల్లోనూ హైదరాబాద్ వచ్చి వందల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. దీంతో హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో వసతులు నిండుకుంటున్నాయి. వీరి కారణంగానే దవాఖానల్లో పడకల కొరత ఏర్పడుతున్నదని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరిన్ని బెడ్లను ఏర్పాటుచేస్తున్నది.
జనాభా ఆధారంగానే మందులు, ఆక్సిజన్ కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్గదర్శకాల ప్రకారం.. ఆయా రాష్ర్టాల జనాభాను ప్రాతిపదికగా తీసుకొని రెమ్డెసివిర్ వంటి ఔషధాలు, ఆక్సిజన్, వ్యాక్సిన్లను కేటాయిస్తున్నది. మన జనాభాకు అనుగుణంగా రోజుకు కేవలం 2,500 లోపే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పంపిణీ చేస్తున్నది. వాటిలో నుంచే గుర్తింపు పొందిన ప్రైవేటు దవాఖానలకు కూడా సరఫరాచేయాల్సి వస్తున్నది. ఆక్సిజన్ను కూడా కేంద్రం జనాభా ఆధారంగానే కేటాయిస్తున్నది. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న రోగులకు మానవతా దృక్పథంతో వీటిని వినియోగించడం వల్ల తెలంగాణ ప్రజలకు వాటి కొరత ఏర్పడుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం ఈ అంశాన్ని పరిగణించడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆక్సిజన్లో అధిక భాగం వారికే
మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్గఢ్ల నుంచి హైదరాబాద్ వచ్చి చికిత్స తీసుకుంటున్నవారిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండటంతోనే ఆక్సిజన్ అవసరాలు భారీగా పెరిగాయి. 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరిపోదని, కనీసం 500 నుంచి 600 మెట్రిక్ టన్నులు కేటాయించాలని రాష్ట్రం కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. మహారాష్ట్ర లాంటి చోట్ల డబుల్ మ్యూటెంట్లు, వేరియంట్లకుతోడు.. ధూమపానం, పొగాకు, గుట్కాలు తినడంవంటి వ్యసనాల కారణంగా రోగుల్లో తక్కువ సమయంలోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్కు గురవుతున్నారు. దీంతో వారికి ఆక్సిజన్ బెడ్లు, వెంటిలెటర్లను వినియోగించాల్సి వస్తున్నది. కేంద్రం కేటాయించిన కోటా నుంచే.. ఎక్కడాలోటు రాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన పేషంట్లకు కూడా మెరుగైన చికిత్స అందిస్తూ.. అందరి మన్ననలు అందుకొంటున్నది.
కరోనాను జయించిన 91 ఏండ్ల బామ్మ
తొమ్మిది పదుల వయసు దాటిన ఓ బామ్మ మహమ్మారిని అలవోకగా జయించింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఎర్రబెల్లి సుగుణమ్మకు 91 ఏండ్లు.15రోజుల క్రితం గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను జాకారంలోని ఐసొలేషన్ సెంటర్కు తరలించారు. బుధవారం పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఇంటికి తిరిగొచ్చింది. సరైన సమయంలో చికిత్సకు తోడు మనోధైర్యం, మానసికఆందోళన లేకుండా వి శ్రాంతి తీసుకుంటే వైరస్పై విజయం సులువేనని నిరూపించింది సుగణమ్మ. మందులు, పోషకాలున్న ఆహా రం, డాక్టర్ల సలహాలతోనే కోలుకున్నదని కూతురు సమ్మక్క ఆనందంగా చెప్పారు.
ఇతర రాష్ర్టాల పేషంట్లనూ పరిగణనలోకి తీసుకోవాలి
హైదరాబాద్లో లభిస్తున్న మెరుగైన చికిత్స కారణంగా సహజంగానే చుట్టుపక్కల రాష్ర్టాల నుంచి కరోనా రోగులు పోటెత్తుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల (ప్రభుత్వ, ప్రైవేటు) దవాఖానల్లో 40% వసతులు వారికే సరిపోతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ,
ఛత్తీస్గఢ్, బీహార్ నుంచే ఎక్కువమంది చికిత్స కోసం వస్తున్నారు. వీరిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం కేవలం మన రాష్ట్ర జనాభా ఆధారంగానే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ను కేటాయిస్తున్నది. దీనివల్ల కొన్నిసార్లు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ మన.. పర అనే బేధం లేకుండా వచ్చివారందరికీ మంచి చికిత్సను అందిస్తున్నాం. ఆక్సిజన్ ఇబ్బంది ప్రస్తుతానికి లేనట్టే. కానీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత కనపడుతున్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో ఎలాంటి ఇబ్బంది కలక్కుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొంటున్నాం. మన దేశంలో.. కరోనాకు చక్కగా చికిత్స అందిస్తున్న ప్రధాన కేంద్రం హైదరాబాద్ అనే చెప్పవచ్చు.