ఖమ్మం సిటీ, మే 17: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కొవిడ్ బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి ‘నేనున్నా’నంటూ అభయమిస్తున్నారు. బాధితులకు అవసరమైన ఆక్సీజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సకాలంలో అందేలా చొరవ తీసుకుంటున్నారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని కొవిడ్ వార్డును సందర్శించారు. తన సొంత ఖర్చుతో తయారు చేయించిన పౌష్టికాహారంతోపాటు పండ్లను దాదాపు 320 మందికి స్వయంగా అందించారు. వైద్యసేవలు పొందుతున్న వారందరినీ ఆప్యాయంగా పలుకరించారు. ఎవ్వరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. మంత్రి ఔదార్యానికి మంత్ర ముగ్ధులైన బాధితులు చేతులెత్తి ‘సల్లంగా ఉండు’ బిడ్డా అంటూ దీవించారు.