హుజూరాబాద్, అక్టోబర్ 12: ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతో బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. కమలాపూర్ మండలం ఉప్పల్లో కారు ఢీకొట్టిన ఘటనలో ఆటోడ్రైవర్ మృతిచెందాడని, కారు యజమాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దోస్త్ విశ్వనాథవినోద్ అని వెల్లడించారు. దేశ్రాజ్పల్లికి చెందిన నాగుర్ల రాజేందర్ మృతికి కారణమైన కారు తనదేనని దుష్ప్రచారం చేసి, ఈటల సహా ఆ పార్టీ నాయకులు వివేక్, ఏనుగు రవీందర్రెడ్డితో వందల మంది ఘటనాస్థలి వద్ద ఆందోళన చేశారని చెప్పారు. కారు డ్రైవర్ తిరుపతి సైతం బీజేపీ కార్యకర్త అని, అతని సభ్యత్వం నంబర్ను కూడా చెప్పారు. మంగళవారం హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. ఈ ఘోరాన్ని టీఆర్ఎస్కు పూసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఓట్లు దండుకోవాలన్న కుతంత్రంలో భాగంగా బీజేపీ నేతలే ఆటోను కారుతో గుద్దించి టీఆర్ఎస్పై నెట్టే ప్రయత్నం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. దొంగేదొంగ అన్నట్టుగా బీజేపీ నాయకుల వ్యవహారం ఉన్నదని, విషసంస్కృతితో కాషాయదళం నిండిపోయిందని ఆరోపించారు. ఆటోడ్రైవర్ మృతికి బీజేపీ వాళ్లే కారణమైనందున.. మృతుడి కుటుంబానికి ఈటల రాజేందర్, బండి సంజయ్, వివేక్ తలా రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్చేశారు. ఈటల ఉప్పల్లో గంటల పాటు ఎలా రాస్తారోకో చేస్తారని, ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
చంపడం బీజేపీ వాళ్లకు కొత్తకాదని, యూపీలో కేంద్ర మంత్రి కొడుకు నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్నాడని బాల్క సుమన్ గుర్తుచేశారు. నెత్తురు రుచి మరిగింది మీరని, తెలంగాణ కోసం నెత్తురు ధారబోసింది తామని స్పష్టంచేశారు. ఉత్తరభారతంలో దళిత బాలికలపై లైంగికదాడిచేసి చంపుతున్నది బీజేపీ నేతలుకాదా అని ప్రశ్నించారు. కొన్ని కేసుల్లో తండ్రులు సాక్షులుగా ఉంటే, వారిని సైతం చంపించిన చరిత్ర బీజేపీకి ఉన్నదని చెప్పారు. కిరాతకులకే ముత్తాతలైన బీజేపీ నాయకులు.. హుజూరాబాద్లో ఎన్నికల కోసం కిరాయి మూకలను దింపినట్టు తెలిసిందని పేర్కొన్నారు. దసరా సమయంలో అల్లర్లు సృష్టించి సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారనే పక్కా సమాచారం ఉన్నదని చెప్పారు. ఎన్నికలో లబ్ధికోసం బీజేపీ దాడులు చేస్తున్నారని, టీఆర్ఎస్ పట్టణ సోషల్మీడియా కార్యకర్త నాంపల్లి జగన్పై హత్యాయత్నమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. బాధితుడు ఎంజీఎంలో చికిత్స పొంది మంగళవారం ఇంటికి వచ్చాడని చెప్పారు. ఉత్తర భారత సంస్కృతిని రాష్ట్రంలో బీజేపీ ప్రవేశపెడుతున్నదని, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనే బీజేపీ దాడులసంస్కృతికి తెరలేపిందని గుర్తుచేశారు.
టీఆర్ఎస్సోళ్లు రూ.20 వేలు ఇస్తున్నారంటూ ఈటల దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి ఆయనే ఇబ్బడిముడిగా డబ్బులు పంచి, గ్రామాల్లో మద్యం తాగిస్తున్నారని బాల్క సుమన్ దుయ్యబట్టారు. బొట్టుబిల్లలు, గ్రైండర్లు, కుట్టు మిషన్లవంటి తాయిలాలను ఇప్పటికే ఈటల పంచిన సంగతి తెలియంది కాదని చెప్పారు. రేపోమాపో సభ పెట్టుకొని భార్యభర్తలిద్దరూ మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లు కార్చి, కొంగు చాపి ఓట్లు అడిగేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాల ఈటలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు.
ప్రజలను మభ్యపెడుతూ సానుభూతి పొందేందుకు రాజేందర్ ప్రయత్నం చేస్తున్నాడని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విమర్శించారు. ఆటోడ్రైవర్ మృతి ఘటనపై డీజీపీ విచారణ జరిపించాలని కోరారు. బీజేపీ నేతలే కొందరు టీఆర్ఎస్ కండువాలు కప్పుకుని, టీఆర్ఎస్ నాయకులే చర్చలు జరుపుతున్నట్టుగా, ఈటలకు అనుకూలంగా మాట్లాడటం, బీసీల దగ్గరకు వెళ్లి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ డబ్బుసంచులతో కార్లను తిప్పుతున్నదని, డీజీపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్లను తనిఖీచేయాలని కోరారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, నాయకులు పాడి కౌశిక్రెడ్డి తదితరులు ఉన్నారు.