న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే దేశంలో ధరలు మండిపోతున్నాయని, ద్రవ్యోల్బణం ఎగబాకుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం ఆరోపించారు. ఆర్ధిక వ్యవస్థ నిర్వహణలో మోదీ సర్కార్ లోపభూయిష్టంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంధన ధరలు, ఇతర వస్తువుల ధరలు చుక్కలు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను తక్షణమే తగ్గించాలని, వీటిపై దిగుమతి సుంకాలను సమీక్షించాలని చిదంబరం మంగళవారం డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణానికి ప్రధాని నరేంద్ర మోదీయే నేరుగా బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు, ఆర్ధిక వ్యవస్థ నిర్వహణలో చేతకానితనం వల్లే ధరలు మండుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.