చండీగఢ్: పంజాబ్లోని ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ శుక్రవారం సమావేశమైంది. సీఎం అమరీందర్ సింగ్ గవర్నర్ ప్రసంగంపై సభలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఎస్ఏడీ పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల ఆమోదానికి మద్దతిచ్చిందని అన్నారు. దీనిపై అకాలీదళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్ వద్దకు దూసుకువచ్చి నినాదాలు చేశారు. సమావేశాలకు ఆటంకం కల్పించవద్దని అకాలీదళ్ ఎమ్మెల్యేలను స్పీకర్ రాణా కేపీ సింగ్ కోరారు. సభను రెండుసార్లు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైనప్పటికీ పరిస్థితిలో మార్పురాలేదు. ఎస్ఏడీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నినాదాలు కొనసాగించారు. దీంతో స్పీకర్ అకాలీదళ్ ఎమ్మెల్యేల అందరి పేర్లు చదివి వారిని మిగతా అసెంబ్లీ సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి సభను మరోసారి వాయిదా వేశారు.
మరోవైపు అకాలీదళ్ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకుండా సభలో నేలపై భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వారిని బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్ను స్పీకర్ ఆదేశించారు. కాగా పంజాబ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10 వరకు కొనసాగనున్నాయి.