‘ప్రస్తుతం హీరోలు బాక్సాఫీస్ లెక్కల కంటే కథకు ప్రాముఖ్యతనిచ్చే ధోరణి పెరిగింది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రభావంతో ప్రేక్షకులకు ప్రపంచ సినిమాలపై అవగాహన పెరిగింది. రొటీన్ సినిమాలు చేస్తే తిరస్కరిస్తున్నారు’ అని అన్నారు రాహుల్రామకృష్ణ. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ దర్శకుడు. నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో రాహుల్ రామకృష్ణ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
అనుదీప్ చెప్పిన పాయింట్ నన్ను ఆకట్టుకుంది.. అతడు కథ చెబుతున్నప్పడు ఛైర్లో నుంచి పడిపోయేంతగా నవ్వుకున్నా. వ్యక్తిగతంగా మనకు నచ్చే జోక్స్ను ఇతరులు ఇష్టపడాలని లేదు. మాకు నచ్చిన కామెడీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా అనే సందేహాలు చిత్రీకరణ సమయంలో అందరిలో కలిగాయి. తొలిరోజు మార్నింగ్ షో పూర్తయ్యేసరికి అవన్నీ తొలగిపోయాయి. అంచనాలకు మించి సినిమా పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది.ఎలాంటి అంశాన్నైనా వ్యంగ్యం, వెటకారం జోడిస్తూ వినోదాత్మకంగా చెప్పగల నేర్పు దర్శకుడు అనుదీప్కు ఉంది. కథ కంటే హాస్యానికి పెద్దపీట వేస్తూ సినిమాను విభిన్నంగా తెరకెక్కించాడు
‘అర్జున్రెడ్డి’ సినిమా నటుడిగా నాకు స్టార్ హోదాను తెచ్చిపెట్టింది. ఆ సక్సెస్ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసేంత బిజీగా మారిపోయా. ప్రస్తుతం మూసధోరణితో కూడిన కమర్షియల్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాల్లోని పాత్రలు నవ్విస్తాయి. అలాగని ప్రతిసారి అలాంటివే చేస్తే వర్కవుట్ కావు. అందుకే ఇకపై కొత్తదనం ఉన్న సినిమాలే చేయాలనుకుంటున్నా. ‘వై’ అనే సినిమాలో మొదటిసారి యాక్షన్ సీక్వెన్స్లో నటించా. ఆ సినిమా చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు హీరో కావాలనే కోరిక వెంటాడింది.
హాస్యనటుల మధ్య పోటీ ఉన్నా హార్డ్వర్క్తో పాటు అదృష్టం కలిసిరావడంతో విజయాల్ని అందుకోగలుగుతున్నా. మా అమ్మ నా సినిమాలకు బెస్ట్ క్రిటిక్. నా నటన తనకు నచ్చదు. ఇంట్లో తన ముందు ఎలా ఉంటానో అలాగే సినిమాల్లో కనిపిస్తానని ఎప్పుడూ చెబుతుంది. నేను బాగా నటించానని మా అమ్మ చెప్పినప్పుడే నటుడిగా సక్సెస్ అయినట్లుగా భావిస్తా. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం ఓ పెద్ద సినిమాలో నటిస్తున్నా. ఈ ఏడాది ఆ చిత్రం విడుదలకానుంది. నాలుగు సినిమాల్లో లీడ్ క్యారెక్టర్స్ చేయబోతున్నా. బాలీవుడ్తో పాటు తమిళ చిత్రసీమ నుండి ఆఫర్స్ వస్తున్నాయి.