హైదరాబాద్ : ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజీగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ అనారోగ్యంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే లింగోజీగూడ డివిజన్కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి చేసింది. బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.
ఈ డివిజన్ కు ఏప్రిల్ 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున ఆయన అభ్యర్థిత్వం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యేందుకు సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శుక్రవారం ప్రగతి భవన్లో కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వర్గీయ ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం దురదృష్టకరమన్నారు. వారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దు అని బీజేపీ నుండి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీజేపీ ప్రతినిధి బృందం, ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.