స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపుపై సర్కారుకు ధన్యవాదాలు
ప్రగతి సవ్యంగా సాగేలా సమన్వయంతో పనిచేద్దాం..
ఆదిలాబాద్ జడ్పీ సమావేశంలో చైర్మన్ రాథోడ్ జనార్దన్
హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు
ఎదులాపురం, మార్చి 21 : ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏకధాటిగా కొనసాగింది. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 15 అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా విద్య, మిషన్ భగీరథ, పింఛన్లు తదితర అంశాలు చర్చలో ఉన్నాయి. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థలకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై సభ్యులు సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పనిచేద్దామన్నారు.
జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉంటేనే పనులపై పర్యవేక్షణ ఉంటుందని పలువురు సభ్యులు సూ చించగా ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలని జడ్పీ చైర్మన్ సూచించారు. పల్లెప్రగతి పనులను తనతో పాటు కలెక్టర్ , ఎమ్మెల్యేలు నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. వేసవిలో తా గునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ కరోనా గడ్డుకాలంలోనూ బడ్జెట్లో పరిషత్లకు నిధులు కేటాయించారని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ గ్రామాల్లో స్థానిక కమిటీలు సమన్వయంలో పనిచేస్తే సమస్య ఇక్కడివరకు రాదన్నారు. ప్రతిపక్ష జడ్పీటీసీ కూడా భగీరథ పనులపై సంతృప్తి వ్యక్తం జేయడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాదని కొనియాడారు. సమావేశానికి ఈఈలే హాజరవుతున్నారని ఎస్ఈలు ఏం చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం జేశారు. గత సమావేశంలో కూడా ఈ విషయం చెప్పిన వారు పద్ధతి మార్చుకోవడం లేదన్నారు. రైతు వేదికల నిర్మాణాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాల విషయంలో కమిటీని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గంలోని గుర్రాల తండా గ్రామంలో పింఛన్ల అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టంచేశారు.
15 అంశాలపై సుదీర్ఘంగా చర్చ..
ముందుగా డీఈవో రవీందర్రెడ్డి నివేదికను వివరించారు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీటి కోసం ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. మరమ్మతులు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం ఈ నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. 25 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ రావడంతో అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాలోని 1231 గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఒక్కరికీ వంద లీటర్ల చొప్పున నీరు అందజేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తెలిపారు. ప్రతి రోజూ జిల్లాలో 7 కోట్ల 20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో కోటి లీటర్ల నీరు పట్టణ ప్రాంత వాసులకు వెళ్తున్నాదన్నారు. ఈ నెల 31 లోగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో లీకేజీల విషయం సభ్యులు ప్రస్తావించగా వాటిని సరిచేస్తామని ఆయన బదులిచ్చారు.సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డేవిడ్ , జడ్పీ సీఈవో కిషన్ , జడ్పీటీసీలు తాటిపెల్లి రాజు, కుమ్ర సుధాకర్, అనిల్ జాదవ్ , మల్లెపూల నర్సయ్య, చారులత, అరుంధతి, ఎంపీపీలు తుల శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.