హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పార్టీలో నుంచి ఒకర్ని దిగుమతి చేసుకున్నారు. చంద్రబాబు తొత్తు, బినామీని తీసుకొచ్చి పార్టీకి అధ్యక్షుడిని చేశారు. డబ్బు సంచులతో దొరికిపోయినొన్ని అధ్యక్షుడిని చేశారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నోరు పారేసుకుంటున్నాడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను సాధించిన నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర గల నాయకుడు, ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి నాయకుడిని పట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు.. ప్రతిపక్షాలకు కూడా అలానే బుద్ధి చెప్తాం అని కేటీఆర్ అన్నారు. సహనానికి ఓపిక ఉంటుంది. ఓపికకు కూడా హద్దులుంటాయి. రాజకీయాల్లో సంస్కారవంతంగా మాట్లాడాలని కోరుకుంటారు. కానీ ఆ పరిస్థితి లేదు. తప్పని పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా లోపల పడేశారు. మరి మేం కూడా చేయమంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
జర్నలిస్టు ముసుగులో ఉండి కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.