హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): బండి సంజయ్.. మీ మోదీ దేశాన్ని అమ్ముతుంటే ఏం చేస్తున్నవ్? అని టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్రంలోని తమ ప్రభుత్వం ఏంచేసినా ప్రజాశ్రేయస్సు కోసమేనని చెప్పుకొంటూ, రాష్ట్ర ప్రభుత్వం చేసేవి మాత్రం ప్రజలకు నష్టం చేసేవేనన్నవిధంగా మాట్లాడటంపై భగ్గుమన్నాయి. ఏండ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న లక్షల కోట్ల విలువైన ప్రతిష్ఠాత్మక ప్రభుత్వరంగ సంస్థల్ని కేంద్రంలోని బీజేపీ సర్కా రు అప్పనంగా అమ్మేస్తుంటే కనిపించటం లేదా? అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం భూములను అమ్మాలనుకొంటే నానాయాగీ చేస్తున్న బండి నీతులు చెప్పటం ఆపాలని, ముందు కేంద్రం విధానాలను ఎందు కు వ్యతిరేకించటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజ య్ శుక్రవారం స్పందిస్తూ తాము భూముల అమ్మకానికి వ్యతిరేకమని, ఆ భూములు తెలంగాణ ప్రజల ఆస్తి అని, వాటికి ప్రభుత్వం రక్షణగా ఉండాలే తప్పా విక్రయించకూడదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బండి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఎల్ఐసీ, విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, బీపీఎల్, ఎన్టీపీసీ ఇలా ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే నీకు కనిపించడం లేదా..? అని టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ని ప్రశ్నించారు. అవి మాత్రం ప్రజల ఆస్తులు కావా? లక్షల కోట్లను కార్పొరేట్లకు అప్పనంగా కట్టుబెడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? అని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంలో బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఏకంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీది కాదా? బండీ అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేస్తూ అడ్డదిడ్డంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.