హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు దవాఖానల్లో అధిక ఫీజులు, సేవల్లో లోపాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. 88 ఫిర్యాదుల ఆధారంగా 64 దవాఖానలకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని, కొత్త కేసుల సంఖ్య, దవాఖానల్లో అడ్మిషన్లు తగ్గడం, డిశ్చార్జీలు పెరుగడమే ఇందుకు నిదర్శనమని మీడియాకు వివరించారు. ఈ నెల మొదటి వారంతో పోల్చితే పాజిటివిటీ రేటు సగానికి పడిపోయిందని, రికవరీ రేటు 81 శాతం నుంచి 93 శాతానికి పెరిగిందని చెప్పారు. మొదటివారంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు 72 శాతం నిండగా, ఇప్పుడు 39 శాతంగా ఉన్నదన్నారు.
900 ఫిర్యాదులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,200 ప్రైవేటు దవాఖానల్లో కరోనా చికిత్స అందుతున్నదని శ్రీనివాసరావు తెలిపారు. వాటిల్లో అధిక చార్జీలు వసూలు, ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం, సమయానికి బెడ్లు కేటాయించకపోవడం, ఇతర సేవా లోపాలపై సుమారు 900 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిలో ప్రధానంగా 64 దవాఖానల్లో అధిక చార్జీల వసూలు, ఔషధ సంబంధ సమస్యలు, లోపభూయిష్టమైన సేవలపై 88 రకాల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్లో 39, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 22, రంగారెడ్డిలో 15, వరంగల్ అర్బన్లో 7, సంగారెడ్డిలో 2, మహబూబ్నగర్, నిజామాబాద్, యాదాద్రిలో ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు వచ్చినట్టు వివరించారు. అత్యధికంగా కూకట్పల్లిలోని ఓ దవాఖానపై 6, బేగంపేటలోని మరో దవాఖానపై 5 ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ఈ ఫిర్యాదులపై ఆ ఆయా దవాఖానలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. 48 గంటల్లోగా సరైన వివరణ ఇవ్వకుంటే ఆ దవాఖానల్లో కొవిడ్ చికిత్సను నిలిపివేస్తామని, ఆ తర్వాత జరిపే విచారణలో తప్పులు రుజువైతే మొత్తం అనుమతులనే రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే సంబంధిత డాక్యుమెంట్లతో 9154170960 వాట్సప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
బ్లాక్ ఫంగస్ ఔషధాలు నేరుగా కొనుక్కోవచ్చు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 700 వరకు బ్లాక్ ఫంగస్ రోగులు ఉన్నారని, వీరిలో 278 మంది 44 ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. ఔషధాల లభ్యత తక్కువగా ఉండటంతో చాలా మంది ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ చికిత్స తీసుకొని, బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానల్లో చేరుతున్నారని తెలిపారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ దవాఖానల ద్వారా ప్రైవేటు దవాఖానలకు ైగ్లెకోజోమల్ను సరఫరా చేస్తామన్నారు. ఇతర ఔషధాలను నేరుగా తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. తనతోపాటు డీఎంఈ రమేశ్రెడ్డి, సీఎంవో ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.
వారంతా కరోనా రోగులు కాదు
మొదటి, రెండో విడత జ్వర సర్వేలో భాగంగా ఇప్పటివరకు అనుమానిత లక్షణాలున్న సుమారు 3.7 లక్షల మందిని గుర్తించి కిట్లు అందించామని శ్రీనివాసరావు తెలిపారు. అంతమాత్రాన వారంతా కరోనా రోగులు కాదని స్పష్టంచేశారు. ఏటా ఈ సీజన్లో సాధారణంగా 0.5-1 శాతం మంది ప్రజలు జ్వరం, జలుబు, తలనొప్పి లాంటి ఇన్ఫ్లూయెంజా లక్షణాలతో బాధపడుతుంటారని తెలిపారు. మొదటి విడత సర్వేలో 37 వేల బృందాలు 1.02 కోట్ల ఇండ్లను సందర్శించి అనుమానిత లక్షణాలున్నట్టు గుర్తించిన 2,43,257 మందికి కిట్లు అందించారని చెప్పారు. రెండో విడతలో బుధవారం వరకు 55,49,303 ఇండ్లను సర్వే చేసి, 1,17,632 మందికి కిట్లు అందజేశామన్నారు. గురువారం 6,09,056 ఇండ్లు తిరిగి, 8,902 మందికి కిట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. జిల్లాల్లో కొన్ని చోట్ల ఇంకా జ్వర సర్వే జరగలేదని, అలాంటి ప్రాంతాల్లో గురువారం 1,80,766 ఇండ్లను సర్వే చేసి 1,689 మందికి కిట్లు అందించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే ఓపీలో భాగంగా గురువారం 77,891 మందికి స్క్రీనింగ్ నిర్వహించి 11,814 మందికి కిట్లు అందజేశామని తెలిపారు.