ప్రకృతిలో సేదతీరుతున్న గ్రామాలు
రెండు దశల్లోనూ అప్రమత్తం
వైరస్పై గ్రామస్తుల్లో పెరిగిన అవగాహన
పకడ్బందీగా నిబంధనలు అమలు
ఒక్క కేసు రాకుండా నియంత్రణ
ఆదర్శంగా యాస్వాడ, రాగట్లపల్లి
గన్నేరువరం/ఎల్లారెడ్డిపేట, మే 23:కరోనాతో యావత్ ప్రపంచం కకా వికలమవుతున్న తరుణంలో ఆ పల్లెలు నిశ్చింతగా ఉన్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ఆనందంగా కాలం వెల్లదీస్తున్నాయి. కంటికి కనిపించని మహమ్మారి విజృంభిస్తున్నదని తెలియడంతోనే ఆ పాలకవర్గాలు అప్రమత్తమయ్యాయి. గ్రామస్తులకు అవగాహన కల్పించాయి. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చాయి. పరిశుభ్రత, స్వీయనియంత్రణ, ముందు జాగ్రత్తలు పాటించడంతో ప్రస్తుతం ఆ గ్రామాలు కరోనా రహిత పల్లెలుగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.
అవి చూస్తే చిన్న పల్లెలు.. జనాభా అంతా వందల్లోనే.. చేసేది సేను, సెలక పనే. కానీ అక్కడ జన చైతన్యం వెల్లివిరుస్తున్నది. కరోనా విళయతాండవం చేస్తున్న వేళ ఆ పల్లెలు మాత్రం ప్రకృతి ఒడిలో నిశ్చింతగా సేద తీరుతున్నాయి. మహమ్మారి విజృంభించకముందే మేల్గొన్న ఆ గ్రామాలు పారిశుధ్యానికి పెద్దపీట వేసి, స్వీయ నియంత్రణలో ఉండి మనో ధైర్యంతో ముందుకు సాగుతున్నాయి. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, కాయకష్టం చేసుకుంటూ అన్నీ మర్చిపోయి ప్రశాంత జీవనం సాగిస్తూ కరోనా రహిత గ్రామాలుగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.
యాస్వాడ.. కరోనా లేదిక్కడ..
గన్నేరువరం మండలంలో ఇటీవల నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ యాస్వాడ. మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో మానేరు బ్యాక్ వాటర్ను ఆనుకొని ఉండే ఈ ఊరు, చుట్టూ పచ్చని పంట పొలాలు, చెట్లతో ఎంతో ఆహ్లాదకర వాతావరణానికి నెలవైంది. ఇక్కడ 200 మంది జనాభా, 60 ఇండ్లు ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పంచాయతీ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుండడంతో వీధులు పరిశుభ్రంగా ఉన్నాయి. మండలంలోని మిగతా అన్ని గ్రామాల్లో ఎన్నో కొన్ని కరోనా కేసులు నమోదైనప్పటికీ ఇక్కడ మాత్రం నేటి వరకు ఒక్కరూ వైరస్ బారిన పడకపోవడం విశేషం.
జీవన విధానమూ కారణం
గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడిన వారే ఎక్కువగా ఉన్నారు. సహజంగా ప్రతిఒక్కరూ శ్రమైక జీవనం గడుపుతుండడంతో రోగనిరోధక శక్తి కలిగి ఉండడం, పనులపై బయటకు వచ్చిన వేళ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పక్కాగా పాటిస్తుండడం గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడానికి కారణాలుగా తెలుస్తున్నది. పాలకవర్గం ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంతో గ్రామస్తులు మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తున్నారు.
స్వీయ నియంత్రణ
రేషన్ బియ్యం, నిత్యావసర సరుకులకు ఈ గ్రామస్తులు మండల కేంద్రానికి వస్తుంటారు. మండల కేంద్రంలో కరోనా కేసులు నమోదయ్యాయనే సమాచారం మేరకు ప్రస్తుతం రాకపోకలు సైతం తగ్గించారు. వచ్చినప్పటికీ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటున్నారు. ఇటీవల గ్రామంలోని ఇంటింటా వైద్య సిబ్బంది జ్వర సర్వే నిర్వహించగా, ఒక్క కేసు నమోదు కాలేదు.
రాగట్లపల్లి.. కరోనా కట్టడిలో ముందంజ
రాగట్లపల్లి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్కు అనుబంధ గ్రామంగా ఉన్న ఊరు 2014లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 93 కుటుంబాలు, 93 నివాస గృహాలు 175 మంది స్త్రీలు, 152 మంది పురుషులు 327 మంది జనాభా ఉంది. గ్రామస్తులందరూ ఒకే కుటుంబంలా ఉంటారు. ఏ నిర్ణయమైనా సొంతింటి కోసమే అన్న తీరుగా అమలు చేయడం వారి ప్రత్యేకత.
జాగ్రత్తగా ఉంటే భయం లేదు…
మా ఊర్లె ముందుగాలనే చెప్పినం ఎవరి జాగ్రత్తలు వాల్లు తీసుకుంటే భయం అవసరం లేదని. ఇప్పటి దాక మా ఊర్లె ఒక్క కేసు గూడా రాలేదు. ఎవల పొలం దగ్గర వాల్లకే మస్తు పనుంటది. ఇగ కరోనా గురించి మాట్లాడుకునే తీరికెక్కడిది. కాక పోతే ఊరిడిసి బయటకు పోతె మాత్రం కచ్చితంగా మాస్క్ పెట్టుకునుడు మర్సిపోవద్దని ఇంటికి అచ్చినంక కాల్లుజేతులు మంచిగ కడుక్కొని పోవాలని చెప్పినం.
-దాసరి సుజాత, సర్పంచ్ రాగట్లపల్లి, ఎల్లారెడ్డిపేట