హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న వేధింపులను నిరోధించేందుకు జువెనైల్ చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి కోరారు. బుధవారం జువెనైల్ జస్టిస్ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. బాలనేరస్థులకు రక్షణ కల్పించాలని కోరారు. జువెనైల్ కేసులు పెద్ద కోర్టులకు వెళ్లకుండా ఉండేందుకు.. జిల్లా మెజిస్ట్రేట్లకు మరిన్ని అధికారాలు కల్పించాలని సూచించారు.
హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ పెట్టండి : ఎంపీ బీబీ పాటిల్
నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. బుధవారం లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా.. హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికెట్ సెంటర్ను ఏర్పాటుచేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్గా మారిందని, ఇక్కడ వ్యాక్సిన్ ఇండస్ట్రీ ఎంతో సమర్థంగా పనిచేస్తున్నదని తెలిపారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలను మంజూరుచేయాలని కోరారు. అందరికీ చవకైన వైద్యాన్ని అందించాలని, హెల్త్కేర్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు బీబీ పాటిల్ వెల్లడించారు.
వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ను విస్తరించండి: ఎంపీ రంజిత్రెడ్డి
హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలును నడపాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రవాణా మార్గాల్లో ఎంఎంటీఎస్ చాలా కీలకమైనదని చెప్పారు. వికారాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ను కలిపేందుకు రైల్వేలైన్ పనులు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ఆ ప్రాజెక్టును 2004లో ప్రారంభించామని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పారు.