జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్
సూర్యాపేట, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంగా జరుగుతున్న 47వ జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్లను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి జనాలు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం ఆరు కోర్టుల్లో 36 మ్యాచ్లు జరిగాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి హాజరై పోటీలను వీక్షించారు. తన తల్లి సావిత్రమ్మ స్మారకార్థం నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొంటున్న అన్ని జట్ల ప్లేయర్లకు కిట్లను అందజేశారు. బీహార్తో జరిగిన మ్యాచ్లో తెలంగాణ అమ్మాయిల జట్టు 42-38 తేడాతో అద్భుత విజయం సాధించింది. సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెంకు చెందిన కృష్ణవేణి జట్టు విజయంలో కీలకమైంది. పోటీలకు ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్రెడ్డితో పాటు ఎంపీ లింగయ్యయాదవ్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్యాదవ్, ఏపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, శ్రీనివాస్గౌడ్ తదితరులు హాజరయ్యారు.