హైదరాబాద్ : పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్లో విత్తన గణపతులను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వచ్ఛమైన మట్టి, కొబ్బరి నాచుతో వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఈ సారి గణేష్ ప్రతిమల తయారీకి ఉపయోగించిన మట్టిలో వివిధ రకాల విత్తనాలును పొందుపరిచారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పచ్చదనం పెంపు, బాధ్యతతో కూడిన పర్యావరణ కార్యక్రమాలు నిత్య జీవితంలో భాగం కావాలి అని సూచించారు. విత్తన గణపతులను కొలవటం ద్వారా పచ్చదనం పెంపుతో పాటు బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. హరిత తెలంగాణ సాధనలో చింత, వేప చెట్లను విరివిగా పెంచాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం మేరకు ఆ విత్తనాలతో కూడిన మట్టి గణేషులను తయారు చేసి, పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కల అవసరాన్ని గుర్తించి, వాటి విత్తనాలతో కూడా విత్తన గణపతుల తయారీ, పంపిణీ కొనసాగుతుందని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
పర్యావరణ నష్టాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే విత్తన గణపతుల పంపిణీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రతీ యేటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, ప్రజలు- భక్తులు వీలైనంత వరకు మట్టి ప్రతిమలను కొలిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు నిచ్చారు. తద్వారా వాటి తయారీదారులకు ఉపాధి, పర్యావరణహితం అనే రెండు లక్ష్యాలు నెరవేరుతాయని ఎంపీ తెలిపారు. పచ్చదనం పెంపుతో పాటు, పర్యావరణ రక్షణకు వీలైనన్ని చర్యలు తీసుకోవటంలో ప్రతీ ఒక్కరూ తగిన అవగాహనతో వ్యవహరించాలని కోరారు. నెక్ట్స్ గలేరియాలో ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు వచ్చిన మాల్ మేనేజ్మెంట్ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, గో రూరల్ సంస్థ సీఈవో సునీల్, టీ న్యూస్ సీజీఎం ఉపేందర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.