మారేడ్పల్లి, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు విమర్శించారు. కేంద్రప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యమానికి గొడ్డలి పెట్టులా మారుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల ఎస్వీఐటీ ఆడిలోరియంలో తెలంగాణ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల నిర్వాహకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘కోఆపరేటివ్ ఫెడరలిజం-ప్రస్తుత సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో కేశవరావు మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ర్టాలకు ఆర్థికపర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తద్వారా కేంద్రానికి, రాష్ర్టాలకు మధ్య విభేదాలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. రాష్ర్టాల హక్కులను కాలరాసి పెత్తనం చెలాయించే విధంగా కేంద్రం చట్టాలను రూపొందిస్తున్నదని కేకే విమర్శించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ… రాష్ర్టాల ఉమ్మడి జాబితాలోని అంశాలలో కేంద్రం జోక్యం చేసుకుంటూ, పెత్తనం చేలాయించాలనుకోవడం పాలకుల నియంతృత్వాన్ని తెలియజేస్తున్నదన్నారు. రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం కల్గించేలా తాము అధికారంలో లేని రాష్ర్టాలను ఆర్థికంగా అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని సూచించారు. 35 రకాల సుంకాలను విధిస్తున్న కేంద్రం మొత్తంగా సంవత్సరానికి 2.74 లక్షల కోట్ల పన్నులు రాష్ర్టాల నుంచి వసూళ్లు చేస్తుందని వివరించారు. రాజ్యంగ వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రజామోదంతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చి దుశ్చర్యలకు కేంద్ర పాల్పడుతుందని విమర్శించారు. రాజ్యాంగ పరిధిలో ఉండాల్సిన గవర్నర్ ప్రజాప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు టంకశాల అశోక్, మాజీ రాజ్యసభ సభ్యుడు రాంచంద్రయ్య, మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు,సీపీఐ నేత సాంబశివరావు, సీనియర్ జర్నలిస్టు కే శ్రీనివాస్, టీపీసీఎస్ఎంఏ అధ్యక్షుడు పీఎల్ శ్రీనివాస్, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.