కనులపండువగా రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తెల్లవారుజామున అంగరంగ వైభవంగా అగ్నిగుండాలు
ఆటపాటల నడుమ స్వామివారి ఊరేగింపు
మోత్కూరు, ఏప్రిల్ 3 : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రం లో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి అగ్నిగుండాలను శనివారం తెల్లవారుజామున వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండాలకు నిప్పు అంటించి స్వామివారిని శేష వాహనంపై భక్తులు మోసుకుంటూ పట్టణ పురవీధులగుండా ఊరేగింపు నిర్వహించా రు. రాత్రంతా స్వామివారి సేవలో భక్తిపాటలు ఆలపిస్తూ సంకీర్తన ప్రదర్శనలు చేశారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణ భక్తులు స్వామివారి అగ్నిగుండాల మహోత్సవానికి భారీగా తరలివచ్చారు. అగ్నిగుండం నుంచి స్వామివారిని మోసుకుంటూ భక్తులు నడిచివెళ్లారు. ఈ సందర్భంగా స్వామి వారి కోసం ప్రత్యేకంగా నిర్మించిన కల్యాణ మండపం వద్ద లింగాయత్ బలిజలు స్వామి వారి ఖడ్గాలు చదువుతూ గెలుపు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ఆలయ సన్నిధి చుట్టూ తిప్పుతూ ప్రదక్షిణలు చేశారు. ఆలయ పూజారి టీ .రాజలింగంశర్మ ఆధ్వర్యంలో పూజారులు పారునంది వెంకటరమణశర్మ, లక్ష్మణమూర్తిశర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలోప్రముఖులను సన్మానించారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుంగపట్ల యాకయ్య భక్తులకు 1000 మాస్కులు పంపిణీ చేశారు. మాజీ ఎంపీటీసీ మన్నెకమలమ్మ-భీమయ్య అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య, ప్రతినిధులు అరవిందరాయుడు,రాజు, కిష్టయ్య, లింగయ్య, సంతు, వెంకన్న, మొరిగాల వెంకన్న, లింగాయత్ బలిజలు అంజయ్య, శివ, కుమార్, శేఖర్, సాగర్ పాల్గొన్నారు.