హైదరాబాద్ : వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ర్టం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఇవేమీ కనబడటం లేదని ఆయన నిప్పులు చెరిగారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పల్లా మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయి కాబట్టే.. ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అద్భుతమైన విజయం ఇస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఒక్క వానా కాలంలోనే ఒక కోటి 50 లక్షల ఎకరాలను సాగు చేశాం. ఈ సంవత్సరం కూడా సాగు చేయబోతున్నాం. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. రాష్ర్టంలోని ప్రతీ చెరువు ఎండాకాలంలోనూ నీటితో కళకళలాడాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తున్నాం. ఇలాంటి పథకం కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉందా? అని ప్రశ్నించారు. 110 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించి.. దేశంలోనే రికార్డు సృష్టించామని తెలిపారు. రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఎఫ్సీఐ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారా? అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల నేతలపై రైతులు తిరగబడుతున్నారు. రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి త్వరలోనే నగదు జమ చేస్తామన్నారు.
ప్రయివేటు టీచర్లను ఆదుకుంటున్నది కేవలం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వమే అని చెప్పారు. కర్ణాటకలో ప్రయివేటు టీచర్లను అరెస్టు చేసి జైల్లో పెట్టించారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు టీచర్లను ఆదుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షలకు పైగా ప్రయివేటు టీచర్లకు నెలకు రూ. 2 వేలు, 25 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆదుకుంటుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.