హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా నుంచి అదనంగా రూ.500 కోట్లు కేటాయించడం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో స్థానిక సంస్థలకు గ్రాంటుపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నపై చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఈ ఏడాది తక్కువ రావటంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా నుంచి రూ.500 కోట్లు సమకూర్చారని తెలిపారు. ప్రాదేశిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనపై ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తరచుగా తమ వద్దకు వస్తున్నారని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు ఆఫీసులు లేకపోవడం లోటుగా ఉన్నదని పేర్కొన్నారు. స్కూళ్లలో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు జాతీయ జెండాలు ఎగురవేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలపై జరిగిన చర్చలో కూడా కవిత పాలుపంచుకొన్నారు. అంగన్వాడీ టీచర్లు చనిపోవడం, ఇతర కారణాల వల్ల ఖాళీ అయిన పోస్టులను గతంలో జిల్లా కలెక్టర్ల స్థాయిలోనే భర్తీచేసేవారని, ఇప్పుడు నియామకాలు సెంట్రలైజ్ చేయడం వల్ల భర్తీ ఆలస్యమవుతున్నదని తెలిపారు. మినీ అంగన్వాడీలకు జీతాలు పెంచడంతోపాటు వాటిని అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటే వెంటనే చేయాలని సూచించారు.
గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా నిధులు ఇస్తున్నామని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. తాను ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు శాలువాలు కప్పి బాగా చేస్తున్నారని పొగిడితే, శాలువాలు కాదు నిధులు ఇవ్వాలని కోరానని గుర్తుచేశారు. ఈ సమావేశాల సందర్భంలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలను మరోసారి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలపై చర్చకు మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానమిస్తూ అంగన్వాడీ టీచర్ల సెలక్షన్స్ గతంలో ఎమ్మెల్యేలు చైర్మన్లుగా, ఆర్డీవోలు కన్వీనర్లుగా ఉన్న కమిటీలు చూసేవని తెలిపారు. వాటివల్ల ఇబ్బందులు రావటంతో కలెక్టర్లకు రిక్రూట్మెంట్ బాధ్యత అప్పగించామన్నారు. ఇటీవల సభలో మహిళా ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ను కలిసినప్పుడు అంగన్వాడీ టీచర్ల రిక్రూట్మెంట్ అంశాన్ని ప్రస్తావించగా నోట్ పెట్టాలని సూచించినట్టు వెల్లడించారు. సాధారణ అంగన్వాడీలతో సమానంగా మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. వీటిని మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయటం కేంద్రప్రభుత్వం చేతిలో ఉన్నదని, ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.