హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉపన్యాసంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న ప్రశంసల వర్షం కురిపించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కళాకారులకు పెన్షన్లు అనే అంశంపై గోరెటి వెంకన్న మాట్లాడారు.
మొన్న కేటీఆర్ ఉపన్యాసం విన్న తర్వాత ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, జేఎన్యూ యూనివర్సిటీల్లో ఇంటలెక్సువల్స్ మాట్లాడితే ఎట్ల ఉంటుందో అలా మాట్లాడారు. ప్రామాణికంగా మాట్లాడారు. సిద్ధాంతపరంగా మాట్లాడారు అని కేటీఆర్ను వెంకన్న ప్రశంసించారు.
తెలంగాణ కళలకు నిలయం. తెలంగాణ సంప్రదాయం దరువు సంప్రదాయం అని సింగ భూపాలుడు చెప్పారు. తెలంగాణకు చెందిన 200 మంది నాట్యకత్తెల పేర్లు.. కోణార్క్లోని సూర్యదేవాలయంలో ఉన్నాయి. తెలంగాణలో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలతో ఈ ప్రాంతం పులకరించిపోతోంది. సంగీతానికి గొప్ప విలువ ఉంది. సీఎం కేసీఆర్కు అభివృద్ధి ప్రణాళికలతో పాటు సాహిత్యంపై విశేష అవగాహన ఉంది. తెలంగాణ ప్రభుత్వం కళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. 500 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్య 12 మెట్ల కిన్నెరను గుర్తించడం గొప్ప విషయమన్నారు. ఏ ప్రభుత్వమైతే సాహిత్యానికి, సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందో.. ఆ పాలనలో మానవ స్వభావం వివేకవంతంగా ఉంటుంది. మనషుల యొక్క స్పృహ జ్ఞానవంతంగా ఉంటుంది. తెలంగాణలోని యాచకులు, బుడగజంగాలు, దేవదాసీలు, యక్షగాన కళాకారులను గుర్తించి, పెన్షన్ మంజూరు చేయాలని గోరెటి వెంకన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.