ఇల్లందకుంట, ఆగస్టు 14 : దళిత బంధు పథకం ఎన్నికల స్టంట్ కాదని.. ఆర్థికంగా వెనుకబడిన దళితుల జీవితాలకు ఇది స్ట్రెంత్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. దళితబంధు అర్హులందరికీ వస్తుందని, ఎవరూ ఆగం కావొద్దని సూచించారు. ఇల్లందకుంటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మూడేళ్లలో రాష్ట్రంలోని అర్హులైన దళితులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్కు దళితులంతా రుణపడి ఉండాలని, ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆగం కావొద్దని కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత సాధికార పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో సంబంధం లేకుండా బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తారని తెలిపారు.