హైదరాబాద్ : ఈ రాష్ర్ట ప్రజలకు గవర్నర్ ప్రసంగం ఒక టానిక్లా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎమ్మెల్యే గొంగిడి సునీత శాసనసభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టం పురోగతిలో ఉందని గవర్నర్ వ్యాఖ్యానించడం అద్భుతమన్నారు. ప్రభుత్వ పథకాలను కొనియాడుతూ గవర్నర్ ఇచ్చిన కితాబు.. ఒక టానిక్లా పని చేస్తుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావం వల్ల రాష్ర్ట ఆదాయం తగ్గినప్పటికీ.. సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదన్నారు. ప్రతిపక్షాలు ఏమి చేయరు.. చేస్తున్నవారిని అభినందించరు.. రన్నింగ్ కామెంట్రీ ఆపాలని విపక్ష సభ్యులకు ఆమె సూచించారు.
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు. కరోనా టెస్టుల్లోనూ రాష్ర్టం ముందంజలో ఉందన్నారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ చర్యలు ఆమోఘం అని గవర్నర్ ప్రశంసించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని గవర్నర్ చెప్పడం.. కేసీఆర్ పాలనకు నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ చొరవ కారణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి, అభ్యున్నతి కనిపిస్తుందన్నారు.
విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వ్యవసాయానికి పెద్దపీట వేశాం. వలస పోయిన వారంతా.. తమ ఊర్లకు తిరిగొచ్చి వ్యవసాయం చేస్తున్నారంటే.. అది కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. రైతులకు వెన్నుదన్నుగా సీఎం కేసీఆర్ ఉంటున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలపై ప్రశంసల వర్షం కురుస్తుందని గొంగిడి సునీత తెలిపారు.