హైదరాబాద్ : రాష్ర్టంలో సుస్థిరాభివృద్ధి జరిగేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. రాష్ర్టంలో అమలు చేస్తున్న పథకాలన్నీ క్షేత్రస్థాయికి చేరాయని తెలిపారు. గాంధీజి కలలు కన్న గ్రామస్వరాజ్యం తెలంగాణ పల్లెల్లో కనిపిస్తుందన్నారు. కరోనా సమయంలోనూ రాష్ర్టం అభివృద్ధిలో ముందు వరుసలో ఉందన్నారు. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ను ప్రకటించడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ. 5 కోట్ల చొప్పున కేటాయించడం శుభపరిణామం అని అన్నారు. రాష్ర్ట పథకాలను కేంద్రంతో పాటు పలు రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. ఆర్టీసీని అమ్ముకుంటున్నారని కొందరు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఆర్టీసీ అప్పుల పాలైందని అనేక విమర్శలు చేశారు. సంకల్ప బలంతో ఆర్టీసీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఆర్టీసీ పేదల బండి అని అభివర్ణించారు. ఆర్టీసీకి రూ. 3 వేల కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ నేడు రైస్ బౌల్, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.