కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఇల్లంతకుంట మండలం బూర్జునూర్ లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈటెల రాజేందర్ నుంచి హుజురాబాద్ ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. నియోజకవర్గంలో అన్ని సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించారు అని స్పష్టం చేశారు. సొంత తమ్ముడి వలే ఈటలను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకుని పార్టీలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. 2004లో అనేకమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నప్పటికీ.. విద్యావంతుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని, కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి అని ఈటలకు కేసీఆర్ టికెట్ ఇచ్చి గెలిపించారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినా బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని ఎమ్మెల్యే రవి శంకర్ పేర్కొన్నారు.